బీఏ రాజు మరణం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది – రాజశేఖర్, జీవిత దంపతులు

ప్రముఖ జర్నలిస్ట్, సూపర్‌హిట్ పత్రికాధినేత, అగ్ర పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఆకస్మిక మరణం తమ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాజశేఖర్, జీవిత దంపతులు తెలియజేశారు. బీఏ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 

రాజశేఖర్, జీవిత దంపతులు మాట్లాడుతూ “తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల నుంచి మాకు బీఏ రాజుగారితో పరిచయం ఉంది. ఎటువంటి కల్మషం లేని మంచి మనిషి. మేం నటించిన చాలా చిత్రాలకు ఆయన పీఆర్వో చేశారు. మాకు పర్సనల్ పీఆర్వోగానూ పని చేశారు. కొన్నేళ్లు రాజశేఖర్ గారి డేట్లు చూశారు. తరచూ మేం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పటికీ మా కొత్త సినిమాలు వస్తే ఫోన్స్ చేసి మాట్లాడతారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. మా పిల్లల సినిమాలపై కూడా అదే శ్రద్ధ చూపించారు. మాకు అండగా ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. బీఏ రాజు మరణం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది. ఎంతో బాధగా ఉంది. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు రాజుగారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్లకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని అన్నారు.