మంత్రి కొండా సురేఖతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్

ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇవాళ హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై ఇరువురు చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను కొండా సురేఖకు రేణు దేశాయ్ వివరించారు.

తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ని నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు సురేఖ. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణు దేశాయ్‌కి కొండా సురేఖ స్వయంగా అలంకరించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా రేణు దేశాయ్ ఉన్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంట్లో ఈ సమావేశం జరిగింది.