అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం

నట సింహ నందమూరి బాలకృష్ణ గారి గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సంవత్సర కాలం పాటు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఈనెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాజర్ పేట ఎన్వీ ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ప్రముఖ డైలాగ్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత ప్రఖ్యాత సినీ నటి జయప్రదకు ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథి గా, సుప్రసిద్ధ సినీ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి ఆత్మీయ అతిథి గా వ్యవహరించనున్నారు. వీరు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలానే, ఈ శతజయంతి ఉత్సవాలు లో భాగంగా
తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలు ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (28/11/2022)నాడు “అడవి రాముడు” సినిమాను ప్రదర్శిస్తునారు. ఈ ప్రదర్శనకు జయప్రద, నందమూరి రామకృష్ణ, ఏ. కోదండరామిరెడ్డి హాజరై ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించనున్నారు.