నాకు పద్మ విభూషణ్ రావడానికి కారణమైన వారందరికీ నా కృతజ్ఞతలు – మెగాస్టార్ చిరంజీవి

ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడాలంటే నేను ఏ పార్టీలో లేను. పిఠాపురంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. పవన్‌‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లటం లేదు. పవన్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చాడు. అలాగే పవన్ కూడా నన్ను ప్రచారానికి రావాలని ఎప్పుడూ అడగలేదు’’ అన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.