జీ5 ఓటీటీ నెక్స్ట్ తెలుగు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తున్న సుష్మితా కొణిదెల, విష్ణు ప్రసాద్

హైదరాబాద్, 11 జూలై 2020: స్ఫూర్తివంతమైన ‘లూజర్’ నుండి ‘చదరంగం’, ‘గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)’ వరకు… బెస్ట్ కంటెంట్‌ను తెలుగు వీక్షకులకు అందించడంలో జీ5 ముందు వరుసలో ఉంది. కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా – డిఫరెంట్ జానర్ సిరీస్‌లను ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చూశాం. వీక్షకుల అభిరుచులకు అనుగుణంగా జీ5 కంటెంట్‌ అందిస్తోంది. ఒరిజినల్ వెబ్ సిరీస్ నుండి డైరెక్ట్-టు-ఒటిటి ఫీచర్ ఫిలిమ్స్ వరకూ… బోలెడు అందిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది జీ5. నిర్మాతలు విష్ణు ప్రసాద్, సుష్మితా కొణిదెలతో నెక్స్ట్ ఒరిజినల్ సిరీస్ కోసం అసోసియేట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.

‘సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ప్రకటించారు. దీనికి ఆనంద్ రంగా దర్శకుడు. ‘ఓయ్’ సినిమా తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సబ్జెక్టు ఇదే. ఇందులో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘జీ 5’ ఓటీటీలో ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా వాస్తవ ఘటనల ప్రేరణతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని, అదే కాన్సెప్ట్ అని యూనిట్ తెలిపింది.

నిర్మాత శ్రీమతి సుష్మితా కొణిదెల మాట్లాడుతూ “అత్యంత వీక్షకాదరణ కలిగిన ఓటీటీ వేదిక ‘జీ 5’తో మా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు” అని అన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో అవసరమైన భద్రతా చర్యలతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది.