తిరుమల వెళ్లే భక్తులకు సినిమాల కష్టాలు – ధనుష్, నాగార్జున సినిమా కారణంగా

తిరుమల వెళ్లే భక్తులకు సినిమా కష్టాలు ఎదురయ్యాయి. ఓ మూవీ షూటింగ్ కారణంగా భక్తులకు సమస్య వచ్చింది. ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ సినిమా మొదలైంది. అయితే తిరుపతిలో అలిపిరి దగ్గర నాగార్జున – ధనుష్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచే షూటింగ్ మొదలు కాగా.. అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఓ వైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరో వైపు షూటింగ్ జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో స్థానికులు, భక్తులు ఇబ్బంది పడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేశారు. ఈ క్రమంలో స్థానికులు కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అలిపిరి వద్ద ఉదయం కాసేపు మాత్రమే షూటింగ్ జరిగినా తిరుమల కొండపైకి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమల కొండపైకి వాహనాల్లో వెళ్లాలంటే అలిపిరి మీదుగానే ప్రయాణించాలి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో షూటింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమా యూనిట్ ముందుగానే అనుమతి తీసుకుని చేసినట్లు తెలుస్తోంది. ధనుష్‌- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.