కరోనా సమస్య ఏ ఒక్కరిదీ కాదు అందరిదీ, కలిసే ఎదుర్కోవాలి – హీరో నాగచైతన్య

దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపు మేరకు కరోనా అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు హీరో నాగచైతన్య. సాజయా కాకర్ల, దీప్తి లతో కలిసి ఆయన కొవిడ్ విజేత సునీత, సామాజిక కార్యకర్త జలాల్ తో మాట్లాడారు. కొవిడ్ పట్ల సమాజంలో ఉన్న అపోహలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై నాగ చైతన్య చర్చించారు. శుక్రవారం సాయంత్రం ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ చర్చ జరిగింది. ఇందులో

సాజయా కాకర్ల మాట్లాడుతూ…పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం అంటూ ఇంతకాలం మనం అనేక అడ్డు గోడలు పెట్టుకున్నాం. వీటి ఆధారంగా మనం వేరు అనుకున్నాం. కానీ మనమంతా ఒక్కటే అని నిరూపించింది కరోనా మహమ్మారి. అంతా సమానమే ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు అని అర్థమయ్యేలా చెప్పింది. ప్రతి ఒక్కరం చనిపోవాల్సిందే. అయితే చివరి కర్మలు గౌరవంగా జరగాలి. కానీ కరోనా భయంతో చాలా బాధాకరంగా అంత్యక్రియలు జరుగుతున్నాయి. కొవిడ్ ను ఎదుర్కొవడంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవి ప్రభుత్వం పరిష్కరించాలి. అన్నారు.

జలాల్ మాట్లాడుతూ…మాది సామాజిక సేవా సంస్థ . తెలంగాణలో అనేక జిల్లాల్లో మా వాళ్లు పనిచేస్తున్నారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు ధైర్యం కావాలి. మా కుటుంబంలో కూడా వైరస్ వచ్చింది. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వాళ్లు వైరస్ నుంచి ఆరోగ్యవంతులయ్యారు. కరోనా గురించి మేము అవగాహన కల్పిస్తున్నాం. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాం. ఇందుకోసం కొన్ని షార్ట్ ఫిలింస్ కూడా తీశాం. సమాజంలో మరికొంత మంది పెద్దలు ముందుకు రావాలని కోరుతున్నాం. అన్నారు.

కొవిడ్ విజేత సునీత మాట్లాడుతూ…నేను ప్రభుత్వ హెల్త్ సెంటర్లో నర్సును, మాది మహబూబ్ నగర్ జిల్లా. కొవిడ్ డ్యూటీలో భాగంగా జూన్ 6న సరోజినీ దేవీ ఆస్పత్రిలో విధులకు చేరాను. జూన్ 12 నుంచి నాలో అనారోగ్యం మొదలైంది. టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. మొత్తం 28 రోజులు ఒక్కదాన్నే ఇంట్లో ఉంటూ మందులు వాడుతూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నాను. వ్యాయామాలు చేశాను. పసుపు, తులసి, కొబ్బరి నీళ్లు వంటి ఆహారం నాకు హెల్ప్ చేసింది. ఆరోగ్యంగా తిరిగి విధుల్లోకి చేరాను. నా అనుభవం చెప్పాలంటే ధైర్యంగా ఉండాలి. భయపడితే సమస్య పెరుగుతుంది. వైద్యులు చెప్పినట్లు మందులు వాడాలి. వ్యాయామం, ఎండలో ఉండి ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అన్నారు.
స్టాఫ్, మహబూబ్ నగర్

నాగచైతన్యస మాట్లాడుతూ.. మార్చి నెల మొదట్లో మన దగ్గరకు వైరస్ వచ్చింది. ఆ తర్వాత అనేక రకాల సమాచారాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ గందరగోళం క్రియేట్ చేశాయి. ప్యానిక్ పరిస్థితి, భయం తీసుకొచ్చాయి. వైరస్ ను ఎదుర్కొవాలంటే మనమంతా ఒక్కటవ్వాలి. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు. అందరిదీ. దీన్ని అంతా ఎదుర్కొవాల్సిందే. వైరస్ ఉందని మీలోనే దాచుకుంటే అది మొదటి స్టేజి నుంచి చివరి స్టేజ్ కు వెళ్తుంది. కాబట్టి లక్షణాలు ఉన్నాయని అనిపించిన వెంటనే వైద్య సాయానికి వెళ్లాలి. ఇప్పుడు అనేక చోట్ల కరోనా చికిత్సలు చేస్తున్నారు. వైరస్ ఉండే బయటకు చెప్పండి. కొవిడ్ నుంచి కోలుకున్నాక దాని గురించి మీ అనుభవాలు ప్రచారం చేయండి. అలాగే ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రండి. అలా చేయడం వల్ల మీరు చాలా మంది జీవితాలు కాపాడగల్గుతాం. అన్నారు.