రామోజీ ఫిల్మ్ సిటీలో అమితాబ్, రకుల్

బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మే డే’. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ దీనిని తెరకెక్కిస్తుండగా.. నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. ఇందులో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత అబితాబ్, అజయ్ కలిసి సినిమా చేస్తుండటంతో.. దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, అంగీరా ధార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

లాక్‌డౌన్ తర్వాత తాజాగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ ప్రారంభమైంది. తొలి సీన్‌కి అజయ్‌ దేవగణ్‌ స్నేహితుడు, ప్రముఖ తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్‌ కొట్టారు. ఈ షూటింగ్‌ కోసం అమితాబ్‌తో పాటు రకుల్ హైదరాబాద్ వచ్చారు. ఏప్రిల్ 29, 2022లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అజయ్ ప్రకటించాడు.

ఇక అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘మైదాన్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబర్ 11న ఈ సినిమా విడుదల చేయాలని గతంలో అనుకున్నారు. కానీ లాక్‌డౌన్ రావడంతో ఆగస్టు 13,2021కి వాయిదా వేశారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో ఫుట్‌బాల్ కోచ్ పాత్రలో అజయ్ నటిస్తున్నాడు