శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ తొలి చిత్రం ’22’

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం ’22’. ఈ చిత్రం బేనర్‌ లోగో, టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం జూన్‌ 22న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగింది. మా ఆయి ప్రొడక్షన్స్‌ బేనర్‌ లోగోను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించగా, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ టైటిల్‌ను ఎనౌన్స్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ – ”శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వశాఖలో పని చేశాడు. తనంటే నాకు చాలా ఇష్టం. చాలా క్రమశిక్షణ, డెడికేషన్‌ ఉన్న వ్యక్తి. తనకి దర్శకుడిగా అవకాశం రావడం మంచి విషయం. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతల్ని అభినందిస్తున్నాను. సహజంగా బి.ఎ. రాజుగారి ద్వారా సినిమా అవకాశం వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ.. శివ తన టాలెంట్‌తో కథను రెడీ చేసుకొని నిర్మాతలని మెప్పించి ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ ’22’. జూలై 22 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపనున్నారు. శివ ఇండస్ట్రీలో చాలా పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ – ”కొత్త డైరెక్టర్‌, కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బి.ఎ. రాజుగారి మీద ఆధారపడకుండా సినిమా మీద ప్యాషన్‌తో ఓ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించి తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని మళ్లీ తననే హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. శివ మా బేనర్‌లో కొన్ని సినిమాలకు వర్క్‌ చేశాడు. మంచి యాటిట్యూడ్‌ ఉన్న వ్యక్తి. ఈ ’22’ టైటిల్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. నాకు ‘ఈరోజుల్లో’ సినిమా ఎలా ఒక ట్రెండ్‌ మార్క్‌ అయిందో ఈ ’22’ సినిమా శివకి అలా ట్రెండ్‌ మార్క్‌ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ – ”ఈ రోజు జయగారు ఎక్కడున్నా చాలా సంతోషిస్తారు. ఆమె డైరెక్టర్‌గా సినిమా తీయడం కన్నా.. శివ డైరెక్టర్‌ అవ్వాలనేది ఆమె కోరిక. శివ మా బేనర్‌లో ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రొడ్యూసర్స్‌కి చాలా కంఫర్టబుల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. ఒక డైరెక్టర్‌కి ప్రొడక్షన్‌ మీద కంట్రోల్‌ ఉండటం అనేది చాలా అవసరం. శివ మీద నాకు నమ్మకం ఉంది. శివలో మంచి స్పార్క్‌ ఉంది. చాలా తక్కువ టైమ్‌లో ఎక్కువ సినిమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – ”నేను, బి.ఎ. రాజుగారు స్వంత అన్నదమ్ముల్లాంటి వాళ్లం. ఈరోజు మా రాజుగారి అబ్బాయి శివ తనకు తానుగా స్వయంకృషితో వెబ్‌ సిరీస్‌ చేయడం, అది నిర్మాతకి నచ్చి తనతో సినిమా తీయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే జయగారి దీవెనలు ఎప్పుడూ శివకి ఉంటాయి” అన్నారు.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ మాట్లాడుతూ – ”దర్శకుడు శివ నాకు గత ఐదారు సంవత్సరాలుగా తెలుసు. ఈ స్టోరి విన్నాను. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమా శివకి మంచి పేరు తెస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి థాంక్స్‌” అన్నారు.

హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి మాట్లాడుతూ – ”శివగారు నాకు వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చి, ఇప్పుడు మళ్లీ హీరోగా సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌” అన్నారు.

ఫైట్‌ మాస్టర్‌ జాషువా మాట్లాడుతూ ”ఖైదీ నంబర్‌ 150, సాహో వంటి సినిమాలకు వర్క్‌ చేసిన నేను శివ చెప్పిన కథ వినగానే ఎంతో ఎక్సైట్‌ అయి ఈ సినిమా ఒప్పుకున్నాను. ఇందులో యాక్షన్‌ పార్ట్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది” అన్నారు.

కో-డైరెక్టర్‌ పుల్లారావు కొప్పినీడి మాట్లాడుతూ ”ఇంతకుముందు నేను, శివ కలిసి వర్క్‌ చేశాం. ’22’ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్‌గా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.

హీరోయిన్‌ సలోని మిశ్రా మాట్లాడుతూ ”ఫలక్‌నుమాదాస్‌ తర్వాత చేస్తున్న సినిమా ఇది. చాలా ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ఆయి ప్రొడక్షన్స్‌కి, పూరి కనెక్ట్స్‌కి థాంక్స్‌” అన్నారు.

దర్శకుడు శివకుమార్‌ బి. మాట్లాడుతూ – ”నేను మారుతి, పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌గారి సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేశాను. అనుకోకుండా ఒకరోజు కొరియోగ్రాఫర్‌ ఆనీ మాస్టర్‌ నాతో నిర్మాతలు రూపేష్‌కుమార్‌, సుశీలా దేవిగారిని కలిసి కథ చెప్పమన్నారు. అప్పుడు నేను ముందుగా ఒక వెబ్‌ సిరీస్‌ చేద్దాం అన్నాను. అలా కథ నచ్చడంతో నాకు వెబ్‌ సిరీస్‌ చేసే అకాశం ఇచ్చారు. అదే ప్రొడక్షన్‌లో నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌. అలాగే నన్ను బ్లెస్‌ చేయడానికి వచ్చిన సి. కల్యాణ్‌, వి.వి. వినాయక్‌, మారుతి, కొండా కృష్ణంరాజుగార్లకు థాంక్స్‌. మా నాన్న బి.ఎ. రాజుగారు నా అన్ని స్ట్రగుల్స్‌లో నాకు తోడుగా ఉంటూ, నన్ను ప్రతిక్షణం ముందుకు నడిపిస్తున్నారు. మా మమ్మీ జయగారి దగ్గర నేను ముందుగా ప్రొడక్షన్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత దర్శకత్వ శాఖలో మెళకువలు తెలుసుకున్నాను. మమ్మీ ఎక్కడున్నా.. ఆమె ఆశీస్సులు నాతోనే ఉన్నాయని నమ్ముతున్నా. అలాగే మేం అడగ్గానే సలోని మిశ్రా డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి ఇచ్చిన పూరి కనెక్ట్స్‌ పూరి జగన్నాథ్‌గారికి, ఛార్మిగారికి థాంక్స్‌” అన్నారు.

రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌జీత్‌ సింగ్‌, జయప్రకాశ్‌, రాజేశ్వరి నాయర్‌, రవివర్మ, అమిత్‌ తివారి, ఫిదా శరణ్య, మాస్టర్‌ తరుణ్‌ పవార్‌, బేబి ఓజల్‌ పవార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి, స్టంట్స్‌: జాషువ, స్టిల్స్‌: వరహాలమూర్తి, ప్రొడక్షన్‌ హెడ్‌ అండ్‌ కొరియోగ్రఫీ: అనీ లామా, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివకుమార్‌ బి.