‘కన్నప్ప’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి…

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’ చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే కన్నప్ప పోస్టర్‌తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు.

న్యూజిలాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఫస్ట్ షెడ్యూల్ ముగిసిందని కన్నప్ప చిత్రయూనిట్ ప్రకటించింది. న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన 600 మంది ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో ఈ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశామని మేకర్లు తెలిపారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు ఇండియాకు తిరిగి రానుంది.

విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దాదాపు 80 శాతం వరకు న్యూజిలాండ్‌‌‌లోనే షూట్ చేయనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టుగా మోహన్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా ట్వీట్ వేశారు. ‘న్యూజిలాండ్ లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం’ అని ప్రకటించారు.

పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద విష్ణు మంచు నిర్మిస్తున్నారు.