నరకం చూశాను.. ఎమోషనల్ అయిన రాజశేఖర్

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న హీరో రాజశేఖర్ తాజాగా ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. కరోనాతో తాను మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడ్డానని, ఒక దశలో బతుకుతానన్న ఆశ కూడా సన్నగిల్లిందని రాజశేఖర్ చెప్పాడు. తన ఊపరితిత్తులు దెబ్బతిన్నాయని, కరోనా వచ్చాక దాదాపు 10 కిలోల బరువు కోల్పోయానని చెప్పాడు. తాను ఆస్పత్రిలో నరకం అనుభవించానని, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులు చెప్పలేదని, కుటుంబసభ్యులు కూడా చెప్పలేదని రాజశేఖర్ తెలిపాడు.

RAJASEKHAR

తన అభిమానులు, బంధువులు శ్రేయాభిలాషులు దీవెనలతోనే తాను ఆరోగ్యంగా ఇంటికి వచ్చానని, తాను అజాగ్రత్తగా ఉండటం వల్లే కరోనా సోకిందని రాజశేఖర్ తెలిపాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని, ప్రతిఒక్కరూ మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, డబ్ల్యూహెచ్వో సూచనలు పాటించాలన్నాడు. కరోనా రాదనే ధోరణి సరికాదని, ప్రస్తుతం తన పని తాను చేసుకుంటున్నానని రాజశేఖర్ తెలిపాడు.

వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్‌లో పాల్గొంటానని, కరోనా తనకు గొప్ప పాఠం నేర్పిందని, ఇక నుంచి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటానని రాజశేఖర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రాజశేఖర్ ఇటీవల కరోనా బారిన పడటంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాజశేఖర్ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని అప్పట్లో వార్తలు రావడంతో రాజశేఖర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చాలామంది సెలబ్రెటీలు హాస్పిటల్‌కి వెళ్లి రాజశేఖర్‌ను పరామర్శించారు. రాజశేఖర్‌కు వైద్యులు చాలారోజులు ఐసీయూలో చికిత్స అందించారు.