‘శబరి’ సినిమా గురించి దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ మాటల్లో

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ…

‘శబరి’ టైటిల్ ఎందుకు పెట్టారు? ఆ పేరు ఎంపిక వెనుక కారణం ఏమిటి?
రామాయణం తీసుకుంటే శబరికి రాముడు సొంత కొడుకు కాదు. ఆయన వస్తారని ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది. రుచిగా ఉన్న ఫలాలు మాత్రమే ఇవ్వాలని, ఒకవేళ ఆ ఫలాల వల్ల ప్రమాదం ఉందేమోనని ఎంగిలి చేసి ఇస్తుంది. ఆవిడ ప్రేమలో ఓ నిజాయతీ ఉంది. ఏపీలో శబరి పేరుతో నది ఉంది. కేరళలో శబరిమల పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు. సంస్కృతంలో శబరి అంటే ‘ఆడ పులి’ అని అర్థం. నా ప్రధాన పాత్రలో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకని, ఆ టైటిల్ పెట్టాను.

‘శబరి’ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది?
నాలుగైదేళ్ల క్రితం ‘శబరి’ ఆలోచన వచ్చింది. ‘ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే… అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది’ – ఇదీ నేను చెబుదామనుకున్న పాయింట్! మారుతున్న సమాజంలోనూ ప్రేమకు స్వచ్ఛమైన రూపం మాతృత్వంలో మాత్రమే ఉంది. పిల్లల విషయంలో చెడ్డ తల్లి ఉండదు. తల్లి ప్రేమలో నిజాయతీ ఉంటుంది. ఈ నేపథ్యంలో, తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఆ పాయింట్ చెబితే బావుంటుందని కథ రాసుకున్నా.

వరలక్ష్మీ శరత్ కుమార్ గారిని ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకోడానికి కారణం?
స్త్రీ ప్రధాన పాత్రల్లో చేయగల సత్తా ఉన్న ఆరిస్టులు ఇండియాలో తక్కువ మంది ఉన్నారు. ఆ కొందరి ‘శబరి’ చేయగల, సినిమా లీడ్ రోల్‌లో వేరియేషన్స్ అన్నిటినీ పండించగల ఆర్టిస్ట్ ఎవరున్నారని చూస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించారు. ‘పందెం కోడి 2’, ‘తార తప్పటై’, ‘విక్రమ్ వేద’, ‘సర్కార్’లో మంచి పెర్ఫార్మన్స్ చేశారు. ఆవిడ హీరోయిన్ గా సినిమాలు చేశారు. ఒక్కసారి హీరోయిన్ అయ్యాక ఆ తరహా రోల్స్ చేయాలని చూస్తారు. కానీ, వరలక్ష్మి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు. ఆవిడ ఇంటర్వ్యూలు చూశా. ఆఫ్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ నచ్చింది. మనం కథలో చెప్పాలనుకున్న విషయాలను ఆరిస్టులు నమ్ముతున్నారా? లేదా? అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మితేనే ముఖంలో కనిపిస్తుంది. సినిమాకు హెల్ప్ అవుతుంది. దర్శకుడిగా ఆ స్వార్థంతో ఆవిడను సంప్రదించాను. చెన్నైలో కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదు.

వరలక్ష్మి గారు కథ ఓకే చేశాక నిర్మాత దగ్గరకు వెళ్లారట!
నచ్చిన ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఆ ఆర్టిస్టుకు తగ్గ ప్రొడక్షన్ హౌస్ దొరకాలి. మనం అనుకున్న విధంగా తీయడానికి సపోర్ట్ చేసే నిర్మాత దొరకాలి. అటువంటి నిర్మాత నాకు లభించడానికి కొంత సమయం పట్టింది. లక్కీగా మహేంద్రనాథ్ గారు నాకు పరిచయం అయ్యారు. అప్పటికి ఆయన ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. వినగానే కథ బావుందని అన్నారు. వరలక్ష్మి గారు ఓకే చేశారని తెలిసి సినిమా స్టార్ట్ చేద్దామన్నారు.

వరలక్ష్మి గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
వరలక్ష్మి గారు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఆవిడ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో చేశారు కనుక కెమెరా, షాట్స్ గురించి అవగాహన ఉంటుంది. ఎక్కువ వివరించాల్సిన అవసరం ఉండదు.

శశాంక్ గారు, గణేష్ వెంకట్రామన్ గారు… ఇతర ఆరిస్టుల గురించి!
వరలక్ష్మి శరత్ కుమార్ గారి కుమార్తెగా బేబీ నివేక్ష నటించారు. శశాంక్ గారు మంచి రోల్ చేశారు. ప్రేక్షకులకు రిప్రజెంటేషన్ తరహాలో ఉంటుంది. థ్రిల్లర్ సినిమాల్లో ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. గణేష్ వెంకట్రామన్ గారు కీలక పాత్ర చేశారు. హీరోయిన్ మానసిక పరిస్థితి ఆ విధంగా అవ్వడానికి కారణమయ్యే పాత్ర చేశారు. ప్రస్తుత సమాజంలో కొన్ని క్యారెక్టర్లు రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు.

పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ముందు నుంచి అనుకున్నారా?
నేను కథ అనుకున్నప్పుడు తెలుగులో తీయాలని అనుకున్నా. వరలక్ష్మి గారికి తమిళ్ మార్కెట్ ఉంది కనుక తెలుగు, తమిళ భాషల్లో చేస్తే బావుంటుందని అనుకున్నా. మా నిర్మాత మహేంద్రనాథ్ గారు వచ్చిన తర్వాత పాన్ ఇండియా రిలీజ్ చేద్దామన్నారు. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలు అయ్యింది. కథలో యూనివర్సల్ అప్పీల్, ఆ పొటెన్షియల్ ఆయన చూశారు. నేను ఓకే అన్నాను.

ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ హిట్ అయ్యాయి. గోపీసుందర్ గారి మ్యూజిక్ గురించి!
‘ఎంత మంచివాడవురా’ చేసినప్పుడు ఆయన పరిచయం ఏర్పడింది. మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆయన ఇతర భాషల్లో చేసే సినిమాల పాటలు కూడా నాకు పంపిస్తారు. ముందు సిట్యువేషన్స్ చెప్పాను. మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత మూవీ కంప్లీట్ అయ్యాక రీ రికార్డింగ్ చేశారు. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్ ఎక్సట్రాడినరీ అవుట్ పుట్ ఇచ్చారు. మా టీం సహకారంతో మంచి సినిమా తీశాం.

ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యిందనేది నిజమేనా?
కథ విశాఖ నేపథ్యంలో సాగుతుంది. అంటే కథ రాసేటప్పుడు హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ అనుకున్నా. థ్రిల్లర్ సినిమాల్లో హిల్ స్టేషన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. వరలక్ష్మి గారు మాకు డేట్స్ ఇచ్చిన టైంలో మేం విశాఖ వెళ్లేటప్పటికి అక్కడ వాతావరణం మేం కోరుకున్న విధంగా లేదు. అప్పుడు కొడైకెనాల్ వెళ్లాం. అందువల్ల కొంత బడ్జెట్ ఎక్కువైంది. అయినా మా నిర్మాత మహేంద్రనాథ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ విషయంలో ఆయనకు థాంక్స్ చెప్పాలి. క్వాలిటీ కోసం ఆయన ఖర్చు చేశారు. ‘హనుమాన్’ వంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువైనా విజయం సాధించిన తర్వాత అందరూ హ్యాపీ. ‘శబరి’తో మా సినిమా టీమ్‌, ప్రొడ్యూసర్‌ కూడా హ్యాపీ అవుతారని ఆశిస్తున్నా.

ఫైనల్లీ… ‘శబరి’ గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?
మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నా. మిగతా ప్రపంచాన్ని, మన బాధల్ని మర్చిపోయి చూస్తాం కదా! ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని ‘శబరి’ తీశా. ఇది థ్రిల్లర్ మాత్రమే కాదు… చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కేవలం భయపెట్టాలని ప్రయత్నిస్తే ప్రేక్షకులు థ్రిల్ అవ్వరు. తెరపై పాత్రలతో కనెక్ట్ అవ్వాలి. అది పాత్రలో ప్రేక్షకుడు తనని తాను ఊహించుకోవాలి. అప్పుడు థ్రిల్ వర్కవుట్ అవుతుంది. ‘శబరి’ మంచి థ్రిల్ ఇస్తుంది.