గోవాలో ‘చెక్‌’ పాట చిత్రీకరణ

యూత్‌ స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్‌’. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. ఇటీవలే ఈ సినిమాలోని ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ గీతాన్ని గోవాలో చిత్రీకరించారు.

nithin check

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘గోవాలో నితిన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై చిత్రీకరించిన పాటతో చిత్రీకరణ అంతా పూర్తయింది. మూడు రోజులు అందమైన లొకేషన్లలో పాటను తెరకెక్కించారు. దీనికి కల్యాణి మాలిక్‌ మంచి బాణీ అందించారు. శ్రీమణి చక్కటి సాహిత్యం అందించగా… శేఖర్‌ మాస్టర్‌ కనుల విందైన నృత్యరీతులు సమకూర్చారు. కథానుగుణంగా సినిమాలో ఒక్క పాటకు మాత్రమే సందర్భం కుదిరింది. అందర్నీ అలరించేలా ఈ పాట ఉంటుంది. కథలో సందర్భం కుదరక మరో పాటకు చోటు కల్పించలేదు. ప్రస్తుతం డీటీయస్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. నిర్మాణానంతర పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటిని అందుకునేలా చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించారు. యాక్షన్‌, థ్రిల్‌ మేళవించిన మంచి చిత్రమిది’’ అని అన్నారు.