క‌రోనా క్రైసిస్ లో ఆక్సిజ‌న్ బ్యాంక్ సేవ‌లందించిన మెగాభిమానుల‌కు ”మెగాస్టార్ చిరంజీవి” అభినంద‌న‌లు!!

క‌రోనా క్రైసిస్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవ‌లందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవ‌ల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్ర‌తినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజ‌న్ సేవ‌ల్లో పాల్గొన్న ప్ర‌తినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైద‌రాబాద్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జరిగింది.ఈ వేదిక‌పై అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు మహేష్ చింతామణి మరియు ర‌మ‌ణం స్వామినాయుడు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకుల నిర్వాహ‌కులు స‌మావేశ‌మ‌య్యారు.


ఈ సందర్బంగా అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు మహేష్ చింతామణి మాట్లాడుతూ “క‌రోనా క‌ష్ట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు చిరంజీవి గారు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్ స‌ర‌ఫ‌రా కార్య‌క్ర‌మం చేశారు. అభిమానుల ద్వారానే ఇవి స‌ర‌ఫ‌రా అయ్యాయి. తాజాగా తెలంగాణ‌ జిల్లాల నుంచి అభిమానులంద‌రినీ పిలిచి చిరంజీవి గారు అభినందించారు. వీరు చేసిన సేవ‌ల్ని కొనియాడి సైనికులుగా అభివ‌ర్ణించారు. నా కోసం ప్రాణాలిస్తాన‌ని అనే అభిమానులు మీరే ప్రాణాల్ని కాపాడినందుకు అభినందిస్తున్నానని రాబోవు కాలంలో పేద‌ల‌ను ఆదుకునేందుకు అభిమానుల స‌హ‌కారం కావాల‌ని చిరంజీవి గారు కోరారు. అభిమానులంతా మెగాస్టార్ కు అండ‌గా నిలుస్తామ‌ని ప్ర‌మాణం చేశారు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి క‌ర్నాట‌క – ఒరిస్సా నుంచి చిరంజీవి అభిమాన సంఘాల ప్ర‌తినిధులు విచ్చేశారు“ అని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-క‌రోనా క‌ష్ట‌కాలంలో నా అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేద‌న చెందాను. క‌రోనా భారిన ప‌డి దుర‌దృష్ట వ‌శాత్తు.. ప్ర‌సాద్ - హిందూపురం.. ఎర్రా నాగ‌బాబు- అంబాజీపేట. ర‌వి - క‌డ‌ప వీరంద‌రినీ కోల్పోయాను. క‌రోనా పొట్ట‌న పెట్టుకుని విషాదాన్ని మిగిల్చింది. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని అన్నారు. క‌రోనా విల‌యం ఎంతో మార్చేసింది. ఇక ఈ క‌ష్ట కాలంలో తాను అండ‌గా నిలుస్తాన‌ని నా స్నేహితుడు శేఖ‌ర్ ముందుకొచ్చారు. త‌న విరామ స‌మ‌యాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు అంకిత‌మిస్తాన‌ని అన్నారు. అత‌డిని చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంక్ ఛీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ గా నియ‌మించాం. స్వామినాయుడు కూడా అతనితో క‌లిసి ప‌ని చేస్తాడు. చెన్నైలో త‌న కెరీర్ సాగుతున్న‌ప్ప‌టి నుంచి శేఖ‌ర్ త‌న‌కు స్నేహితుడు అని ఒక అభిమానిగా వెన్నుద‌న్నుగా నిలిచాడ‌ని చిరంజీవి తెలిపారు.

ఈ వేదిక‌పై చిరు చాలా సంగ‌తుల్ని ప్ర‌స్థావించారు. క‌రోనా భారిన ప‌డిన క్ష‌ణం నుంచి వారికి వారి కుటుంబానికి ఏ విధంగా ధైర్యం ఇవ్వ‌గ‌ల‌ను అని ప్ర‌య‌త్నించాను. ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి మంచి వైద్యం అందించే ప్ర‌య‌త్నం చేశాను. మెగా అభిమానులైన ముగ్గురు నలుగురిని కాపాడ‌లేక‌పోవ‌డం దుర‌దృష్టం. వారి కుటుంబానికి మాన‌సిక స్థైర్యం క‌లిగించాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను. మీరంతా పెద్ద మ‌నసుతో న‌న్ను అర్థం చేసుకుని సేవాకార్య‌క్ర‌మాల్లో భాగ‌మైనందుకు కార్యాచ‌ర‌ణ‌లో పెట్టిన సైనికులుగా ఉన్నందుకు అదృష్టంగా భావిస్తాను అని అన్నారు. ప్ర‌తిక్ష‌ణం అభిమానుల పట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉన్నాన‌ని అన్నారు. గొల్ల‌ప‌ల్లి అనే ఒక ఊరు చాలా ఎక్కువ మంది చ‌నిపోయారు అని తెలిసి ఏం చేయాలి? అని క‌ల‌త చెందాను. అప్పుడు ఆక్సిజ‌న్ బ్యాంకు పెడ‌దామని ఆలోచన పుట్టింది. క‌రోనా ప‌రిస్థితిలో అభిమానులు ముందుకొస్తారా? అనుకుంటే నా పిలుపు విని మీరంతా అండ‌గా నిల‌వ‌డం ఎన‌లేని ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది. అనుకున్న‌దే త‌డ‌వుగా వారంలోనే ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించానంటే ఆ క్రెడిబిలిటీ అభిమానుల‌దేన‌ని అన్నారు. అనుకున్న సిలిండ‌ర్లు దొర‌క్క చాలా ఛాలెంజులు ఎదుర‌య్యాయి. దుబాయ్.. గుజ‌రాత్.. వైజాగ్ లాంటి చోట్ల ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాల్లో ఆక్సిజ‌న్ ని త‌యారు చేయించాం. 3000 పైగా సిలిండ‌ర్లు త‌యారు చేయించాం… కానీ ఆక్సిజ‌న్ కొర‌త‌ను ఎదుర్కొన్నాం. చాలా శ్ర‌మించాం.. అని తెలిపారు. మ‌హేష్ లాంటి అభిమాని ఒక సైనికుడిలా సేవాకార్య‌క్ర‌మాల్లో ప‌ని చేశారు.

క‌రోనాలో వేల ప్రాణాలు కాపాడారు. ఒక శాతం కాదు నూటికి నూరు శాతం మీరు సేవ‌లు చేశారు. ఆ కుటుంబాల‌ను అడ‌గండి .. నూటికి నూరు శాతం అని మెగాభిమానుల గొప్ప‌త‌నాన్ని వారే చెబుతారు. మీరంతా సేవికులుగా నాకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌య్యారు. వ‌చ్చే వారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కూడా మెగాభిమానులంద‌రితో స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నాం. మా ఇంట్లో అంద‌రం చాలా గ‌ర్వ‌ప‌డ్డాం.. ఐదు నెల‌ల ప‌ది నెల‌ల ప‌సిబిడ్డ‌ల‌కు ఆ క్ష‌ణం ఆక్సిజ‌న్ అంద‌క‌పోతే ప్రాణాలు పోగొట్టుకునేవారు. వారి త‌ల్లిదండ్రుల క‌ళ్ల‌లో ఆవేద‌న క‌నిపించింది. వారి ఆశీస్సులు అందించిన‌ప్పుడు సాక్షాత్తూ ఆ భ‌గ‌వంతుడే వ‌చ్చి ఆశీస్సులు అందించిన‌ట్టు భావించాను. అందుకు కార‌ణ‌మైన మీపై గ‌ర్వంగా ఉన్నాను అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.