మే 24న ‘ఎవడు తక్కువ కాదు’

‘పోయిన చోటే వెతుక్కోవాలి’ అని తెలుగులో ఒక నానుడి. ‘పడిన చోటే పైకి లేచి నిలబడాలని’ పెద్దలు చెబుతారు. ఒక మార్కెట్‌లో కుర్రాడు పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో చిన్నోడు అయినా ధైర్యంగా మార్కెట్‌లో పెద్దలతో తలపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారు? ఆ కుర్రాడు, అతడికి ఉన్న వ్యక్తులు ఎలా ఎదుర్కొన్నారు? ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? అనేది మే 24న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘ఎవడు తక్కువ కాదు’ చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు రఘు జయ.

విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’… ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. హరి గౌర సంగీత దర్శకుడు. సెన్సార్ బోర్డ్ సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. మే 24న సినిమా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “ప్రచార చిత్రాలకు, పాటలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనంతో రూపొందిన చిత్రమిది. అలాగే, ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. దర్శకుడు రఘు జయ చాలా సహజంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. రియలిస్టిక్, రా అప్రోచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైల‌ర్‌లో విక్రమ్ సహిదేవ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బావుందని, అగ్రెస్సివ్‌గా చేశాడని ప్రశంసిస్తున్నారంతా. ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్ గారు కూడా మెచ్చుకున్నారు. సినిమా చూసి ప్రేక్షకులు మా విక్రమ్ ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది” అని అన్నారు.

ప్రియాంక జైన్ కథానాయికగా, రఘు కారుమంచి కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి హరి గౌర సంగీత దర్శకుడు. రఘు జయ దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. లగడపాటి శిరీష సమర్పణ.