ఎపి సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!!

కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన 6 నెలల ఫిక్స్డ్ కరెంట్ చార్జీలను తక్షణమే చెల్లించకుండా వాయిదాలలో చెల్లించేలా. అలాగే ఏ , బి సెంటర్ థియటర్స్ వారు తీసుకున్న 10 లక్షల రూపాయల ఋణం, మరియు సి సెంటర్స్ వారు తీసుకున్న 5 లక్షల ఋణం పై ఉన్న వడ్డీ ని యాభై శాతం మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు నిజంగా భారీ ఊరట లభించనుంది. ఈ నిర్ణయం ప్రకటించడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు తెలుగు పరిశ్రమ, ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు తెలియచేసింది. ఈ సందర్బంగా బుధవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కె ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. కరెంట్ చార్జీలు, వడ్డీ రాయితీలను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆనందాన్ని కలుగచేస్తుంది. కరోనా కష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమను, సినీ డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు ఈ సందర్బంగా తెలుగు ఫిలిం ఆఫ్ ఛాంబర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము 9నెలలు కరెంట్ చార్జీలు రద్దు అడిగాము. ప్రభుత్వం 3నెలలు రద్దు చేస్తూ జీవో ఇచ్చారు. మిగతా నెలలు కూడా రద్దు చేస్తారని ఆశిస్తున్నాము, సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం ఈ జీవో కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాం అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసిడెంట్ సి కళ్యాణ్ మాట్లాడుతూ: సిని ఇండస్ట్రీ ప్రతినిధులు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి గారిని జూన్ లో కలిసాము. ఎపి లో సినిమాల షూటింగ్స్ కోసం అక్కడ పర్మిషన్ కావాలని చిరంజీవి , నాగార్జున, రాజమౌళి, నేను, దామోదర్ గారు ఇలా చాలా మందిమి వెళ్లి కలిసాం. జగన్ గారు కూడావై ఎస్ తరహాలోనే ఏ నిర్ణయం అయినా వెంటనే చెప్పేస్తారు. అప్పుడు సినిమా థియేటర్స్ మూసివేస్తే రన్ లేకుండా మూసి వేసి ఉంటె మినిమమ్ చార్జీలు అని చెప్పి కోరడం జరిగింది. థియేటర్స్ ఓపెన్ అయేవరకు వాటిని తీయించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇపుడు మూడు నెలలకు మాత్రమే ఇచ్చారు. జగన్ గారిని మరోసారి కోరతాం , మాకు ఇక్కడ ఇద్దరు తండ్రులు.. వారిద్దరిని కలుపుకుని ముందుకువెళ్తున్నాం. మళ్ళీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. జగన్ గారు ముందే గ్రహించి చెప్పారు. దాంతో మనం జర్నీ చేయాలనీ, అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని థియటర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు మాకు అందిస్తున్న సపోర్ట్ విషయంలో ఆనందంగా ఉంది. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వైజాగ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉందని, ముక్యంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీం అది. దానికి సంబందించిన అన్ని విషయాలు పరిశీలిస్తున్నాం. మన పనులు జరగాలంటే ఇక్కడ ఉండి చేస్తే కుదరదు.. అక్కడికి వెళ్లి మన పనులు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి. జగన్ గారి కుటుంబం కూడా సినిమా రంగంతో అనుబంధం ఉంది.. గతంలో మీరు డిస్ట్రిబ్యూటర్ గా చేసారు. మనమంతా ఒకటే కుటుంబం కాబట్టి సినిమా పరిశ్రమ విషయంలో మీ సపోర్ట్ ఇంకా అవసరం. అలాగే ఈ విషయంలో సపోర్ట్ చేసిన వారికీ కూడా నా ధన్యవాదాలు అన్నారు.

ఫిలిం ఛాంబర్ గౌరవ సంయుక్త కార్యదర్శి జి వీర నారాయణ్ బాబు మాట్లాడుతూ : ఎపి ముఖ్యమంత్రి జగన్ గారికి, పేర్ని నాని గారికి, అలాగే విద్యుత్ శాకా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ విషయంలో చాలా సార్లు మాట్లాడాము. ఈ విషయంలో అయన తప్పకుండా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మూడు నెలలకు మాత్రమే ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మిగతా నెలలకు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన జగన్ గారికి, పేర్ని నాని గారికి ప్రత్యేకంగా సినిమా పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ముందు ముందు కూడా సినిమా పరిశ్రమకు ఇలాగె సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. మార్చ్ 25 నుండి డిసెంబర్ 25 వరకు సినిమా పరిశ్రమ మొత్తం క్లోజ్ అయింది. ఈ తొమ్మిది నెలలకు విద్యుత్ చార్జీలను రద్దు చేయాలనీ అడిగాం.. కానీ వాళ్ళు మూడు నెలలకు రద్దు చేస్తూ జీవో విడుదల చేయడం ఆనందంగా ఉంది. భవిష్యత్తోలో అది కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నాం.. అలాగే షూటింగ్ లొకేషన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. తెలుగు నిర్మాతల మండలి కోసం ల్యాండ్స్ కూడా ఇస్తామని అన్నారు.. ఆ విషయం పై స్పందించి ల్యాండ్స్ విషయంలో కూడా పరిశీలన జరుగుతుంది అని చెప్పారు విజయ్ చందర్ గారు వెంటనే స్పందించి సినిమా పరిశ్రమకు కలవాల్సిన విషయాలన్నీ దగ్గరుండి చూసుకోవడం, అయన ఎప్పుడు నేనున్నాను అన్న తరహాలో మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ వైస్ ప్రసిడెంట్ ముత్యాల రాందాస్, జాయింట్ సెక్రెటరీ సి భరత్ చౌదరి, నిర్మాతల సెక్టార్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి మోహన్ వడ్లపట్ల , ట్రెజరర్ టి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.