యాక్షన్ రియాక్షన్ – తెలంగాణ మహిళ కమిషన్ నుండి వేణు స్వామికి నోటీసులు

ఇటీవలే అక్కినేని నాగచైతన్య, శోభిత తమ కుటుంబ సభ్యుల నేపథ్యంలో నిశ్చితార్థం జరిగింది. అక్కినేని నాగార్జున దానికి సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ తో ఆనందాన్ని వ్యక్తపరచుకున్నారు. గతంలో సమంతతో అక్కినేని నాగచైతన్యకు వివాహం అయినప్పటికీ ఆ తర్వాత వారి ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకోవడం జరిగింది.

వేణు స్వామి అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు అని చెప్పుకోవాలి. తాను ఓ పెద్ద జ్యోతిష్యుడు అంటూ ప్రముఖ రాజకీయ నాయకుల జాతకాలు అలాగే సినీ సెలబ్రెటీల జాతకాలు తనకు తెలుసు అంటూ అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ చానల్స్ లో కనిపిస్తూ హల్చల్ చేస్తూ ఉంటారు. గతంలో కూడా ప్రభాస్, నిహారిక తదితర ప్రముఖుల జాతకాలు తాను చూసాను అంటూ, అలాగే వారి జీవితాల్లో ఎలా జరగబోతుంది తనకు తెలుసు అంటూ తనకు ఇష్టం వచ్చినట్లు కొన్ని చానల్స్ లో మాట్లాడడం జరిగింది. అయితే ఇటీవలె అక్కినేని నాగచైతన్య, శోభిత జాతకాలు తాను చూశాను అంటూ కొన్ని నిరాధారిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానితో నిన్న తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్కు అటు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి వేణు స్వామి పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును అనుసరించి ఈరోజు మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద గారు స్పందిస్తూ వేణు స్వామి కి సమ్మన్లు జారీ చేయడం జరిగింది. ఈనెల 22న వ్యక్తిగతంగా వేణు స్వామి హాజరుకావాలంటూ ఆ నోటీసు ద్వారా తెలపడం జరిగింది.