నాగార్జున, రష్మికకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు

2020వ సంవత్సరానికి సంబంధించి సౌత్ ఇండియా దాదా సాహెబ్ పాల్కే అవార్డులను ప్రకటించారు. తెలుగు నుంచి బెస్ట్ మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు కింగ్ నాగార్జునకు దక్కగా.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా ఎంపికైంది. డియర్ కామ్రేడ్ సినిమాకు గాను రష్మిక ఈ అవార్డు గెలుచుకుంది. ఇక బెస్ట్ యాక్టర్‌గా యువ నటుడు నవీన్ పోలిశెట్టి దాదా సాహెబ్ పాల్కే అవార్డు దక్కించుకున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో నవీన్ పోలిశెట్టి సూపర్ హిట్ అందుకున్నాడు.

rashmika mandanna

ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకలను అలరించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఉత్తమ సినిమాగా నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ సినిమా నిలవగా.. సాహో లాంటి భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీసిన సుజీత్ ఉత్తమ డైరెక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన పాటలుగా రికార్డు సృష్టించాయి.

అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాలోని పాటలు పేరు సంపాదించాయి. దీంతో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎస్‌ఎస్ తమన్‌ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును గెలుచుకున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 20న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.