మల్లారెడ్డి కాలేజీలో సందడి చేసిన రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ టీం

విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ లేటెస్ట్‌ మూవీ ‘శారీ’. ట్యాగ్‌లైన్‌: ‘టూ మచ్‌ లవ్‌ కెన్‌ బి స్కేరీ’. గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో, ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మలయాళ భాషల్లో రూపొందిన ‘శారీ’ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని పలు యదార్థ ఘటనల ఆధారంగా నిర్మించారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యారు రామ్‌గోపాల్‌ వర్మ. మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ కాలేజీలో రామ్‌గోపాల్‌వర్మ, నటులు సత్య, ఆరాధ్య దేవి, నిర్మాత రవిశంకర్‌వర్మ, రాంగోపాల్‌వర్మ సోదరి విజయ పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజంలోని సంబంధాలపై సోషల్‌ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయంపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలు సుమారు 2,000 మంది విద్యార్థినీ విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.

ముందుగా రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘‘భావి భారత నిర్మాతలకు గుడ్‌ ఈవెనింగ్‌! మరియు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!! నేను కూడా మీలాగే ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ని. నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ‘శారీ’ మూవీ సోషల్‌ మీడియా ప్రభావం దాని ద్వారా ప్రమాద భరితంగా జరుగుతున్న కొన్ని అంశాలను ముఖ్య కథాంశంగా తీసుకోవడం జరిగింది. సోషల్‌ మీడియాలో ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌గానీ, ఫోర్‌గ్రౌండ్‌ గానీ తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేయడం వల్ల జరిగిన ఎన్నో ప్రమాదాల గురించి, భయంకర సంఘటనల గురించి మనం చాలా చాలా విన్నాం, చూసాం. అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ ‘శారీ’. ఈ రోజు సినిమాలోని విషయాలను మీతో పంచుకోవడానికి ఇక్కడకు రావడం జరిగింది’’ అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆర్జీవీ ఇచ్చిన సమాధానాలు..
అర్జీవీగారు మీలో వున్న ధైర్యం, భయం అనేది లేకపోవడం వంటి అంశాలు సగం నన్ను హగ్‌ చేసుకొని ఇస్తారా?

  • నేను ఇవ్వను. మగవాళ్ళను హగ్‌ చేసుకునే వాడిలా కనిపిస్తున్నానా! మీరు పవన్‌ కళ్యాణ్‌తో సినిమా డైరెక్ట్‌ చేస్తారా?
  • నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తాను.
    సందీప్‌ వంగా కాంబినేషన్‌లో మీ సినిమా ఆశించవచ్చా?
  • అంటే ఏంటి? నేను హీరోగా అయన డైరెక్ట్‌ చేయాలా? ఆయన హీరోగా నేను డైరెక్ట్‌ చేయాలా? ఇద్దరం దర్శకులం అదెలా సాధ్యం కుదరదు. సినిమా వుండదు.

చిత్ర కథానాయకి ఆరాధ్య దేవి మాట్లాడుతూ ‘‘ముందుగా మీ అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు నా చీర నచ్చిందా? నాకు హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం నాకు తెలుగు అంతగా రాదు. అయినా ట్రై చేస్తాను. మీరు మాపై చూపించిన ప్రేమ నాకు నచ్చింది. నేను కేరళ కుట్టిని. కేరళ కుట్టిగా నేను కనిపిస్తున్నానా? (స్టూడెంట్స్‌ నో అనడంతో) లేదా? అయితే నేను తెలుగు అమ్మాయినే! శారీ చిత్రంతో నేను తొలిసారిగా మీ ముందుకు వచ్చాను. రాముగారు నన్ను ‘శారీ’ చిత్రంతో మీకు పరిచయం చేసారు. ఈ చిత్రం ద్వారా మీ అందరి ప్రేమాభిమానాలను అందుకుంటానని భావిస్తున్నా’’ అన్నారు.

చిత్ర కథానాయకుడు సత్య యాదు మాట్లాడుతూ ‘‘నేను ఢల్లీికి చెందిన స్టేజి ఆర్టిస్ట్‌ని. ఈ శారీ సినిమా కోసం రాంగోపాల్‌వర్మగారు ప్రకటన ఇచ్చారు. నేను ప్రయత్నం చేశాను. నా అదృష్టం కొద్ది అయన దృష్టిలో పడ్డాను. ఈరోజు మీ ముందు హీరోగా నిలబడ్డాను. (అమ్మాయిలను ఉద్దేశించి) నేను హీరోగా కనిపిస్తున్నానా? లేక సైకోగా కనిపిస్తున్నానా? (అమ్మాయిలు హీరో…హీరో…హీరో… అని అరిచారు) ఈ సినిమాలో సైకోగా కనిపిస్తాను. కానీ, రియల్‌ లైఫ్‌లో నేను చాలా మంచివాడ్ని. నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ‘శారీ’ చిత్రం వుంటుంది. చిత్రం చాలా బాగా వచ్చింది. మీరందరూ సినిమా చూడాలి. చూస్తారా? (స్టూడెంట్స్‌ చూస్తాం! చూస్తాం అన్నారు) ఈ నెల 21న నాలుగు భాషల్లో విడుదల అవుతుంది’’ అన్నారు.

ఇంతమంది దర్శకులు వుండగా ఆర్జీవీతోనే ఈ సినిమాకు ఎలా శ్రీకారం చుట్టారు అని స్టూడెంట్‌ అడిగిన ప్రశ్నకు… నిర్మాత రవిశంకర్‌వర్మ సమాధానమిస్తూ ‘‘రామ్‌ గోపాల్‌వర్మ నా మిత్రుడు. ఆయనతో నా పరిచయం వుంది కాని సినిమా చేస్తానని అనుకోలేదు. ఒకానొక సందర్భంలో ఈ శారీ కథ గురించి అయన నాతో చెప్పడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన అనుకున్న కథకు చీరతో ఆరాధ్య కనపడటం, మిగతా నటులను ఎంపిక చేసుకోవడం ఆలా ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యింది. ఓ మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నానని భావించి సినిమా మొదలుపెట్టాము. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.

రామ్‌గోపాల్‌వర్మ సోదరి విజయగారిని, మీరు అర్జీవిని కొట్టారా? అడిగిన ప్రశ్నకు ‘‘చిన్నప్పటి నుండి రాము ఆలోచనలు విభిన్నంగా ఉండేవి. చిన్నప్పుడు ఏదో తప్పు చేస్తే ఒకసారి కొట్టాను. నన్ను తిరిగి కొట్టలేక కాదు, పైగా కరాటే కూడా నేర్చుకున్నాడు. ఎప్పుడూ ఎవరినీ కొట్టే మనస్తత్వం కాదు రాముది. ప్రతీది చాలా లైట్‌గా తీసుకుంటాడు’’ అన్నారు.

లక్కీ లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం నవ్వులతో, విద్యార్థుల కేరింతల మధ్య ఎంతో సందడిగా జరిగింది.

బ్యానర్ : ఆర్జీవీ – ఆర్వీ ప్రొడక్షన్స్ LLP
నటీనటులు : సత్యా యాదు, ఆరాధ్య దేవి, సాహిల్ సంభవాల్, అప్పాజీ అంబరీష్, మరియు కల్పలత తదితరులు సినిమాటోగ్రఫీ : శబరి,
నిర్మాత : రవి శంకర్ వర్మ,
దర్శకుడు : గిరి కృష్ణ కమల్