డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ తరుపున బహుమతిని అందజేశారు. ఇక ఈ భేటీలో అనేక విషయాల మీద ఇరువురు చర్చించారు. ఈ భేటీ గురించి మా అధ్యక్షుడు విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి ప్రభుత్వంతో మేమంతా ఐకమత్యంగా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామ’ని విష్ణు మంచు తెలిపారు.

విష్ణు మంచు ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కన్నప్ప’ చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి దిగ్గజాలు నటిస్తున్న సంగతి తెలిసిందే.