`జాను` ట్రైల‌ర్ విడుద‌ల‌

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా…
హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”నా పదిహేడేళ్ల కెరీర్‌లో తొలి రీమేక్‌ ‘జాను’. తమిళ చిత్రం ’96’కు ఇది రీమేక్‌. ఎప్పుడైనా రీమేక్‌ చేయాలంటే ఏముంటుందిలే అనుకునేవాడిని. అలా అంతకు ముందు రెండు సినిమాలు రీమేక్‌ చేద్దామనుకుని మిస్‌ అయ్యాను. ’96’ సినిమాను తమిళంలో రిలీజ్‌ కంటే ఓ నెల ముందే చూశాను. ప్రివ్యూ థియేటర్‌ నుండి బయటకు రాగానే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాను. ఈ సినిమాకు శర్వానంద్‌, సమంత ఫైనల్‌ కాకముందు చాలా చాలా అనుకున్నాను.
ఆ సమయంలో చాలా కామెంట్స్‌ వినిపించాయి. వీళ్లకేమైనా పిచ్చా? అదొక క్లాసిక్‌ మూవీ. దిల్‌రాజుకేమైనా మెంటలా? ఎందుకు రీమేక్‌ చేస్తున్నాడు? అని చాలా కామెంట్స్‌ వచ్చాయి. నాకు అర్థం కాలేదు. ఒక ఆడియన్‌గా నేను సినిమా చూశాను. తమిళం నాకు పూర్తిగా రాదు. అయినా కూడా పాత్రలతో నేను ట్రావెల్‌ అయ్యి.. సినిమాకు ఎక్కువగా కనెక్ట్‌ అయ్యాను. నేను ఏదైనా ఆరోజు నమ్మానో..ఈరోజు కూడా అదే నమ్ముతున్నాను. సామ్‌ సినిమా చూసి ఓరిజినల్‌ డైరెక్టర్‌ అయితేనే సినిమా చేస్తానని అంది. చివరకు నేను ఓరిజినల్‌ డైరెక్టర్‌నే తెచ్చాను. సమంత నన్ను కలిసినప్పుడు నాపై నమ్మకంతో సినిమా చేయమని చెప్పాను. తను ఓకే అంది. రెండు రోజుల తర్వాత తనే ఫోన్‌ చేసి నాకు థ్యాంక్స్‌ చెప్పడమే కాదు.. మేజిక్‌ను ప్రతిరోజూ ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పింది. శర్వానంద్‌ కూడా సినిమా చూసి బ్యూటీఫుల్‌ మూవీ చేస్తానని నాకు ఫోన్‌ చేశాడు. అలా శర్వా, సామ్‌ ఈ సినిమాలోకి వచ్చారు. తమిళ సినిమాను డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌కుమార్‌, టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమాకు వర్క్‌ చేశారు. ఫిబ్రవరి 7న తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నాం. నేను ఏదైతే ఫీలింగ్‌తో ఉన్నానో.. రేపు సినిమా చూసి ప్రేక్షకులు అదే ఫీలింగ్‌ నిజమని నమ్ముతారు. అమ్మాయిలైతే శర్వాతో ప్రేమలో పడితే.. అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి సోల్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ. అహా! అలాంటి లవర్‌ మనకుంటే బాగుండు అనే ఈర్ష్యతోనే లవ్‌లో పడతాం” అన్నారు.
అక్కినేని సమంత మాట్లాడుతూ – ” ఈ సినిమా క ఓసం దిల్‌రాజుగారు మా మేనేజర్‌కి ఫోన్‌ చేసి నన్ను కలవాలని అనగానే నేను భయపడ్డాను. ఎందుకంటే ఓ క్లాసిక్‌ సినిమాను రీమేక్‌ చేయాలి. విజయ్‌సేతుపతి, త్రిష అద్భుతంగా పెర్ఫామ్‌ చేశారు. దాంతో నేను నిజంగానే భయపడ్డాను. ఒకవేళ దిల్‌రాజుగారిని కలిస్తే ఓకే చెప్పేస్తాను. కాబట్టి దాదాపు వద్దనే చెబుతూ వచ్చాను. చివరికి ఆయన్ని కలిసి ఒక నిమషంలోనే నేను సినిమా చేస్తానని చెప్పాను. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌తో ఉన్న అనుబంధం కారణంగా.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. తొలిరోజు షూటింగ్‌ పూర్తి కాగానే దిల్‌రాజుగారికి ఫోన్‌ చేసి థ్యాంక్స్‌ చెప్పాను. శర్వానంద్‌కి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్‌. ప్రతిరోజూ ప్రతి సీన్‌ వందశాతం పెర్ఫామెన్స్‌ ఇవ్వాలి. మేజిక్‌ జరగాలి. అలాంటిది చాలా కష్టం. దాన్ని కూడా క్రాస్‌ చేశానంటే ఏకైక కారణం శర్వానంద్‌ మాత్రమే. రేపు నాకేదైనా క్రెడిట్‌ దక్కినా మా ఇద్దరికీ దక్కుతుంది. ప్రతిసీన్‌ను ఇద్దరం డిస్కస్‌ చేసుకుని చేశాం. ఇద్దరం వందశాతం ఎఫర్ట్‌ పెట్టాం. మేం మేజిక్‌ క్రియేట్‌ చేశామని అర్థమవుతుంది. ఆ మేజిక్‌ను మీరు ఫిబ్రవరి 7న వెండితెరపై చూస్తారు” అన్నారు.
హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ – ”దిల్‌రాజుగారు ఫోన్‌ చేసి సినిమా చూడమంటే చూశాను. ‘అన్నా ఇది క్లాసిక్‌ చేద్దామా?’ అన్నాను. దానికి దిల్‌రాజు ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జ్‌మెంట్‌పై బాగా నమ్మకం ఉంది. శతమానం భవతి అప్పుడు కూడా నన్ను నమ్ము అన్నారు. నేను నమ్మాను. నాకు పెద్ద హిట్‌ ఇచ్చారు. ఈసారి ఆయన ఆ సినిమాను కూడా దాటిస్తారని అనుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే.. సమంతగారు లేకుంటే నేను అంతగా చేయలేపోయేవాడినేమో. ప్రతిరోజూ సన్నివేశాల్లోని మేజిక్‌ను ఎంజాయ్‌ చేసేవాళ్లం. అది అన్ని సినిమాలకు కుదరదు. రేపు నాకేదైనా పేరొస్తే ఆ క్రెడిట్‌ సమంతకే దక్కుతుంది. ఈ మేజిక్‌ ప్రతి సీన్‌లో ప్రతి మూమెంట్‌లో కనపడుతుంది. చాలా మందికి లవ్‌ ఫెయిల్యూర్‌ అనేది జరుగుతుంటుంది. అయితే అందరికీ ఫస్ట్‌ లవ్‌ అనేది గుర్తుండిపోతుంది. నాకు తెలిసి ఈ మధ్య నాలుగైదేళ్లలో అంతకంటే ఎక్కువగా.. అంటే పదేళ్లపైగానే ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనే చెప్పాలి. చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్‌ చేస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చి తప్పకుండా ఏదో మేజిక్‌ అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ సహా ఎంటైర్‌ టీమ్‌కు థ్యాంక్స్‌. ఫిబ్రవరి 7 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, సమంత‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌, శ‌ర‌ణ్య‌, గౌరి, సాయికిర‌ణ్‌, హాసిని త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర  క్రియేష‌న్స్‌
సంగీతం:  గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
మాట‌లు:  మిర్చి కిర‌ణ్‌
పాట‌లు:  సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి