‘అథర్వ’చాలా కొత్తగా ఉంటుంది.. హీరో కార్తీక్ రాజు !!

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. మొదటి సారిగా క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా ‘అథర్వ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో హీరో కార్తీక్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

‘అథర్వ’ ప్రయాణం ఎలా మొదలైంది? మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
దర్శకుడు మహేష్ రెడ్డి గారిని పది నిమిషాలు కథ చెప్పమన్నాను. కథ ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో.. ఆ చర్చలు మూడు గంటల పాటు జరిగాయి. విన్న వెంటనే కథ బాగా నచ్చింది. అలా అథర్వను ప్రారంభించాం. ఇందులో హీరో పాత్రకు ఆస్తమా ఉంటుంది. అందుకే పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్నా కాలేకపోతాడు. చివరకు క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు.

‘అథర్వ’ సినిమా నిర్మాణ విషయంలో నిర్మాతలు ఎలా సహకరించారు?
నిర్మాతలు (శ్రీనివాస్, సుభాష్) ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమాకు సెట్లు కావాలంటే సెట్లు వేయించారు. మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు.

‘అథర్వ’ చిత్రంలో ఉండే కొత్త పాయింట్ ఏంటి?
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీ కూడా ఒకే ఫార్మాట్‌లో ఉంటాయి. కానీ ఈ మూవీలో ఎలాంటి క్లూస్ లేని ఓ కేసుని ఎలా పరిష్కరించారు అనేది ఆసక్తిరకంగా ఉంటుంది. అదే ఈ సినిమాలో కొత్త పాయింట్.

‘అథర్వ’ లాంటి చిత్రాల్లో నటించడం ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
ఇలాంటి జానర్లో నటించే టైంలో ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. మన నటన మీదే సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. నాకు ఈ పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది.

‘అథర్వ’ చిత్రంలో హీరో హీరోయిన్ల పాత్ర ఎలా ఉంటుంది?
క్రైమ్ జర్నలిస్ట్‌‌(సిమ్రాన్ చౌదరి)గా ఒకరు, సినిమాలో సినిమా హీరోయిన్‌(ఐరా)గా మరొకరు నటించారు. రెండు పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సిమ్రాన్ చౌదరి పాత్రకు, నా కారెక్టర్‌కు చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా ఉంటుంది.

‘అథర్వ’ సినిమాను చూసిన తరువాత క్లూస్ టీం ఎలా స్పందించింది?
క్లూస్ టీం కోసం స్పెషల్‌గా షోను వేయించాం. మూవీని చూసి వారంతా సంతోషించారు. జనరల్‌గా వాళ్లు క్రైమ్ థ్రిల్లర్‌లను చూడరంట. కానీ మా అథర్వను చూసి మెచ్చుకున్నారు. క్లూస్ టీం ఆఫీసర్లు కార్తీక్ రాజు పాత్రలా ఉండాలని కాంప్లిమెంట్ ఇచ్చారు.

‘అథర్వ’కు నిర్మాత నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది?
శ్రీనివాస్ గారు ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. డబ్బు కోసం సినిమా చేయడం లేదని, మంచి సినిమా తీసి ఇవ్వండని మాత్రమే చెప్పారు. బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆయన ఆలోచించలేదు.

‘కౌసల్యా కృష్ణమూర్తి’ తరువాత గ్యాప్ వచ్చింది?
కౌసల్యా కృష్ణమూర్తి తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాను. ఏ చిన్న తప్పు జరగకుండా చూసుకుంటున్నాను. డిసెంబర్ 7 నుంచి కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాను. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా కంప్లీట్ చేశాను.

ఎలాంటి జానర్‌లో సినిమా చేయాలని ఉంది?
ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ జానర్‌లో ఓ మూవీని చేయాలని ఉంది. ఈవీవీ సత్యనారాయణ గారి స్టైల్లో ఓ సినిమాను చేయాలని ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు చేయాలని ఉంది.