పుష్ప 2 విడుదల సమయంలో గాయపడ్డ శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే. రిహాబిలిటేషన్ కేంద్రంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్‌ను సోమవారం ఉదయం నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

శ్రీతేజ్ హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి అతని యోగ క్షేమాలను అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులతో పాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్‌లు ఆర్థికంగా సహాయం చేసిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్ మళ్లీ ఎప్పటిలానే నార్మల్ స్థితికి వచ్చి, అందరితో కలిసి స్కూల్‌కు వెళ్లే వరకు, అలాగే భవిష్యత్‌లో అతనికి ఏ అవసరం వచ్చినా అతనికి, అతని ఫ్యామిలీకి అండగా ఉండేందుకు అల్లు అర్జున్ సైతం కమిటై ఉన్నారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స మొదలు, ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్‌లో ట్రీట్‌మెంట్ వరకు ఎప్పటికప్పుడు అల్లు అరవింద్, బన్నీ వాసులను పంపించి, శ్రీతేజ్ ఆరోగ్యపరిస్థితిని అల్లు అర్జున్ తెలుసుకుంటూనే ఉన్నారు.