ఓటిటిలో రాణిస్తున్న ‘పైలం పిలగా’

ఈ మధ్య ఓ టి టి సంస్థలు కంటెంట్ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడటంలేదు. ఒకప్పుడు వారానికి నాలుగు, ఐదు సినిమాలు రిలీజ్ చేసేవాళ్లు ఇప్పుడు రాసి కన్నా వాసి ముఖ్యం అనే దోరణితో మంచి సినిమా ఒక్కటి ఉన్న చాలు అనే విధంగా తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు . ముఖ్యంగా ఈటీవి విన్ కంటెంట్ క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు . 90’s సక్సెస్ తరువాత పెరిగిన సబ్ స్క్రైబర్స్ ని దృష్టిలో పెట్టుకొని బెస్ట్ కంటెంట్ కి మాత్రమే చోటు కల్పిస్తోంది. ఈ మధ్య రిలీజ్ అయి విజయం సాధించిన కమిటీ కుర్రోళ్లు సినిమా కూడా ఈటీవి విన్ లో మంచి వ్యూయర్షిప్ సాధిస్తోంది. ఈ వారం నుండి స్ట్రీమ్ అవుతున్న పైలం పిలగా సినిమా సెప్టెంబర్ 20 న థియేటర్ లో రిలీజ్ అయి, కాంటెంట్ బేస్డ్ మంచి ఫీల్ గుడ్ మూవీ అని టాక్ రావడం తో ఈటీవి విన్ టీం సినిమా చూసి వెంటనే రిలీజ్ అయిన వారంలో నే అగ్రిమెంట్ చేసుకున్నారు. తెలంగాణ పల్లెలోని యువత ఉపాధి సమస్యను ఆధారంగా చేసుకోని నేటి జనరేషన్ పరిస్థితులను వాస్తవికంగా చూపిస్తూ అలాగే ప్రభుత్వ యంత్రాంగం అలసత్వాన్ని వ్యగ్యంగా, వినోదాత్మకంగా కళ్ళకు కట్టినట్టు చూపిన సినిమా పైలం పిలగా. యూత్ ని ఆకట్టుకునే డైలాగ్స్, పాటలు ప్రత్యేకించి సెకండ్ హాఫ్ లో ఒక మ్యూజికల్ నెరేషన్ లో సాగే కథనం ఈ సినిమాకి బలం కావడంతో ఓటిటి లో కూడా సినిమాకి విశేష స్పందన దక్కుతోంది.

ఉద్యోగం, వ్యవసాయం చేయడం ఇష్టం లేని శివ (సాయి తేజ ) దుబాయ్ వెళ్లి లక్షలు సంపాదించాలనుకుంటాడు, ఇంకోవైపు ఉద్యోగం మానేసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ఊళ్లోనే హాయిగా ఉండాలనుకునే దేవి (పావని కరణం) తో ప్రేమలో పడతాడు . ఈ పరిస్థితుల్లో దుబాయ్ వెళ్ళడానికి రెండు లక్షలు అవసరం పడతాయి . శివ నానమ్మ (డబ్బింగ్ జానకి ) తాతల కాలం నాటి బీడు భూమి అమ్ముకొని దుబాయ్ వెళ్ళమని సలహా ఇస్తుంది . కానీ ఆ ల్యాండ్ లిటిగేషన్ లో ఉంటుంది. ఇంతకీ ఆ స్థలం రహస్యం ఏంటి , అది అమ్మి దుబాయ్ వెళ్లాడా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి .

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆనంద్ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దారేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.