విజయవాడ అమ్మ అనాథాశ్రమానికి విరాళం అందచేసిన హీరో సాయి దుర్గతేజ్

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. తాజాగా ఆయన విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి తన విరాళం అందజేశారు.

ఈ రోజు విజయవాడ చేరుకున్న సాయి దుర్గతేజ్ మొదట శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అమ్మ అనాథశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు.

అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్…చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి. మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న సాయి దుర్గతేజ్ భవిష్యత్ లోనూ తనకు వీలైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తనవంతుగా అండగా నిలబడాలని భావిస్తున్నారు.