N కన్వెన్షన్ కూల్చివేత పై స్పందించిన అక్కినేని నాగార్జున

ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న N కన్వెన్షన్ హాల్ కూల్చివేయడం జరిగింది. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఈ N కన్వెన్షన్స్ హాల్ ఒక చెరువుకు సంబంధించిన స్థలంలో సుమారు 3 ఎకరాలకు పైగా ఆక్రమించి ఈ నిర్మాణం చేసినట్లు ఆరోపణలు ఉండగా హైడ్రా వారు ఈరోజు ఉదయం 4-5 పెద్ద మెషీన్స్ తో కూల్చివేశారు. అయితే దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు ఇవే అంటూ అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి X ద్వారా తెలిపారు.

“స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను.

ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.

స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.

ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.

తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.

అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.” అని తెలిపారు.

https://x.com/iamnagarjuna/status/1827243419028041747?s=48