‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ నుండి ‘చిట్టిబాబు‘గా విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)” ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను పరిచయం చేయగా, అనంతరం శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయంగా నిలవనున్నాయి.

ఈ చిత్రంలో వెంకటేష్ చిట్టిబాబు పాత్రలో అలరించనున్నారు. కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే కుటుంబ పెద్దగా ఆయన పాత్ర ఆకట్టుకోనుంది. విడుదలైన పాత్ర పరిచయ వీడియోలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కనిపిస్తూ, నవ్వులు, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో నిండిన చిత్ర ప్రపంచాన్ని అందంగా పరిచయం చేశారు.

సహజమైన నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటేష్ మరోసారి అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే పాత్రతో రాబోతున్నారు. చిట్టిబాబు పాత్ర ఆయన కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన పాత్రగా నిలిచేలా కనిపిస్తోంది. ఆనందం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఈ పాత్ర ఉండబోతోంది.

తొలి పాత్ర పరిచయంతోనే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వరుసగా రానున్న ఇతర పాత్రల పరిచయాలు కూడా ‘ఆదర్శ కుటుంబం’ ప్రపంచాన్ని మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులకు చేరువ చేయనున్నాయి.

ప్రఖ్యాత ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘
పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకoగానిర్మిస్తున్న “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47” చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సంపూర్ణ పండుగ వినోద చిత్రంగా “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47” ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles