ప్రభాస్ సలార్ సెట్స్ పైకి… 2000 కోట్ల మార్కెట్…

జక్కన్న చెక్కిన మహాకావ్యం బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2460(గ్రాస్) కోట్ల వసూళ్ళు రాబట్టి ఇండియాకి కొత్త స్టార్ గా ఎదిగిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత సాహోతో స్టైలిష్ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ని పలకరించిన ప్రభాస్ 432(గ్రాస్) కోట్ల గ్రాస్ రాబట్టాడు. అంటే గత ఆరేళ్ల కాలంలో మూడు సినిమాలతో ప్రభాస్ దాదాపు 2900(గ్రాస్) మార్కెట్ ని కొల్లగొట్టాడు. ఈసారి తన తర్వాతి సినిమాలతో తన రికార్డు తనే బ్రేక్ చేయాలి అనుకుంటున్నాడో ఏమో కానీ ప్రభాస్… ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు అందులో భాగంగా ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ ని కంప్లీట్ చేసిన ప్రభాస్, ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాల సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు. అందులో ఒకటి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ కాగా మరొకటి కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’. హోమ్బెల్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ సినిమా1970లోని మైసూర్‌ నేపథ్యంలో రూపొందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో దాదాపు 150 కోట్ల వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కరోనా బ్రేక్ నుంచి బయటకి వచ్చి సలార్ షూటింగ్‌ ను చిత్ర యూనిట్ త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నారు. యాక్షన్‌, ఛేజింగ్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే సలార్ సెట్స్ నుంచి బయటకి వచ్చిన మేకింగ్ స్టిల్స్ చూసిన వాళ్లు, ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సిద్దమవుతున్నాడని ఫిక్స్ అయిపోయారు. ఈ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్‌ నటిస్తోంది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ నాయిక వాణీకపూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధ్యే శ్యామ్, ఆదిపురుష్, సలార్… మోస్ట్ యాంటిసిపేటెడ్ లైన్ అప్ మైంటైన్ చేస్తున్న ప్రభాస్… వచ్చే రెండేళ్లలో ఈ మూడు సినిమాలతో దాదాపు 2000-2500 కోట్ల మార్కెట్ క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కి పాన్ ఇండియా వైడ్ ఉన్న క్రేజ్ చూస్తే ఆ అంచనాని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.