దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా ‘ఎవడు తక్కువ కాదు’ ట్రైలర్ విడుదల!

విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’… ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. హరి గౌర సంగీత దర్శకుడు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. మే 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు తక్కువ కాదు’ ట్రైలర్ విడుదల చేశాను. ట్రైలర్ చాలా చాలా బావుంది. ఇది తమిళ సినిమా ‘గోలి సోడా’కు రీమేక్. ఆ సినిమా చాలా బావుంటుంది. ట్రైల‌ర్‌తో పాటు నేను కొన్ని విజువ‌ల్స్ చూశా. విక్రమ్ చాలా చాలా బాగా చేశాడు. ఆర్టిస్టుగా ‘రేసుగుర్రం’, ‘పటాస్’, ‘రుద్రమదేవి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ‘నా పేరు సూర్య…’ సినిమాలో అంత పెద్ద పాత్రను తన భుజాల మీద మోయడం, బాగా నటించడం గొప్ప విషయం. అప్పుడు విక్ర‌మ్‌కు 15 సంవత్సరాలు అంతే. ఇప్పుడు తనకు 17 ఏళ్ళు. ఇంకా ఇంటర్ పూర్తి కాలేదు. ఆర్టిస్టుగా సినిమా నుంచి సినిమాకు ఎదుగుతున్నాడు. లగడపాటి శ్రీధర్ గారి ప్లాన్ కూడా బావుంది. కుమారుణ్ణి హీరోగా పెట్టి ఆయన ఒక పెద్ద సినిమా తీసేయొచ్చు. భారీ లాంఛింగ్ ప్లాన్ చేయవచ్చు. అలా కాకుండా కుమారుడు ఆర్టిస్టుగా ఎదగాలని, కళాకారుడిగా ఒక ప్రయాణం కొనసాగించాలని అనుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. విక్రమ్ సహిదేవ్ కు ఈ సినిమా పెద్ద విజయం అందించాలని, అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడు హరి ఒక పాటను ఇప్పుడే పాడి వినిపించాడు. చాలా చాలా బావుంది. లిరిక్స్ కూడా తనే రాశాడు. సంగీత దర్శకుడు లిరిక్స్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎడిటర్ గా పరిచయం అవుతున్నారు. కొత్త కొత్త సాంకేతిక నిపుణులను పరిచయం చేయడం లగడపాటి శ్రీధర్ గారికి చెల్లింది. ఆర్టిస్టులను పరిచయం చేయవచ్చు గానీ.. కొత్త సాంకేతిక నిపుణులను పరిచయం చేయడానికి చాలా సత్తా ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. పనిపై సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. గట్స్ ఉండాలి. శ్రీధర్ గారికి ఆల్ ది బెస్ట్” అన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన ప్రశంసలు మాలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. సినిమాలో కొన్ని విజువల్స్ చూసిన ఆయన మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. యూత్‌ఫుల్ స్టోరీ ఇది. టీనేజ్ ప్రేమకథతో తెరకెక్కిన న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా. మా విక్రమ్ సహిదేవ్ కు మంచి పేరు తెస్తుందని నమ్మకంగా ఉన్నాం. మే 11న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం” అన్నారు.

ప్రియాంక జైన్ కథానాయికగా, రఘు కారుమంచి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హరి గౌర సంగీత దర్శకుడు. రఘు జయ దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. లగడపాటి శిరీష సమర్పణ.