వి. వి. వినాయక్ చేతులు మీదుగా మమ్ముటీ ‘రాజా నరసింహా’ ట్రైలర్ ఆవిష్కరణ

raja simha trailer

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన ‘మధుర రాజా’ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువాదమవుతోంది. ‘మన్యం పులి’ (పులి మురుగన్‌) సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మంగళవారం అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతులు మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ‘చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఈ రాజా, రాజా బ్యాచ్‌ స్టాంగ్‌ అని. డబుల్‌ స్ట్రాంగ్‌ కాదు.. ట్రిపుల్‌ స్ట్రాంగ్‌ ‘ అని ట్రైలర్‌లో మమ్ముటీ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ”ట్రైలర్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్‌ కరెక్ట్‌గా యాప్ట్‌ అయింది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్‌ అయ్యి, నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి” అని అన్నారు.

నిర్మాత సాధు శేఖర్‌ మాట్లాడుతూ ”వినాయక్‌గారి చేతులమీదుగా ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. చక్కని సందేశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముటీ పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో పాటు ప్రతినాయకుడిగా జగపతిబాబు క్యారెక్టర్‌, గోపీ సుందర్‌ సంగీతం, సన్నీలియోన్‌ ప్రత్యేక గీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసి ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ‘యాత్ర’ లాంటి సూపర్‌హిట్‌ తర్వాత మమ్ముటీ నుంచి వస్తున్న మంచి చిత్రమిది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నాం” అని అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్‌, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.