‘విక్రమ్’ టీజర్ విడుదల

‘విక్రమ్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ప్రముఖ దర్శకుడు బాబి వ్యక్తంచేశారు.
నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ సరసన దివ్యా రావు కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రం టీజర్ ను ఆదివారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు బాబి విడుదల చేశారు.

vikram teaser out

అనంతరం బాబి మాట్లాడుతూ.. “టీజర్ చాలా బావుంది. ప్రేమకథకు థ్రిల్లర్ అంశాలను మిళితం చేసినట్లు అనిపిస్తోంది. ఇటీవల వచ్చిన సంక్రాంతి సినిమాలు అన్నింటికీ పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో అన్ని సినిమాలు ఆడతాయని నిరూపణ అయ్యింది. చిన్న సినిమాలే అని కాకుండా అన్ని సినిమాలు ఆడాలి. ఈ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని అన్నారు.

చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ.. “దర్శకుడు బాబి చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నాం. సమిష్టి కృషికి చక్కటి ఉదాహరణ ఈ చిత్రం. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది” అని చెప్పారు.

దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ.. “విక్రమ్ అనే పాత్ర చుట్టూ తిరిగే కొన్ని పాత్రల స్వరూప స్వభావాలతో ఈ చిత్రాన్ని మలిచాం. సొసైటీలోని పాత్రలకు దగ్గరగా ఈ పాత్రలు ఉంటాయి. కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే…ఓ సినిమా రచయిత ప్రేమకధ ఇది. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. ఈ చిత్రం ప్రేమకథ చిత్రాల్లో విభిన్నంగా ఉంటుంది. టైటిల్ పాత్రలో నాగవర్మ హీరోగా నటించారు. దివ్యరావు హీరోయిన్ గా నటించింది. డైలాగ్స్ చాలా కీలకంగా ఉంటాయి. డైలాగ్స్ తో ఒక టీజర్ ను ప్లాన్ చేశాం” అని చెప్పారు.

నటుడు ఖయ్యుమ్ మాట్లాడుతూ.. తనను ఎప్పుడూ ఆదరిస్తున్నట్లుగానే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్, కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.