భారతీయులంతా గర్వించదగ్గ దర్శకుడు ‘వసంత్ సాయి’!!

నటుడు, రచయిత , దర్శకుడు వసంత్ సాయి దర్శకత్వం వహించింది 13 చిత్రాలే . అయితేనేం ఆయనకు సృజనాత్మక దర్శకుడుగా మంచి పేరుంది . ఇప్పటికే రెండు సార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి రెండు పర్యాయాలు, భారత ప్రభుత్వం నుంచి రెండు సార్లు ప్రతిష్టాత్మకమైన అవార్డులను స్వీకరించారు .


ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన “శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగళమ్ ” అనే సినిమా 68వ జాతీయ అవార్డుల్లో తమిళ భాషలో ఉత్తమ ప్రాంతీయ సినిమాగా ఎన్నికైంది.అంతేకాదు ఈ సినిమా ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశ్యంతో జపాన్ లోని ఫుకువోకా మ్యూజియం లో భద్రపరిచారు. ఇది తమిళనాడుకె గర్వకారణమని ముఖ్యమంత్రి ఎమ్ .కె .స్టాలిన్ అభినందించి ,ఆయన ద్వారా జపాన్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ ను అందుకున్నారు .


వసంత్ సాయి బాలచందర్ శిష్యుడు. ఆయన దగ్గర 18 సినిమాలకు పనిచేశారు . 2005లో “తక్కియిన్ మీదు నాంగు కంగళ్ ” అనే షార్ట్ ఫిలింకు దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు . 2016లో ” సనత్ “అనే సామాజిక చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతియ అవార్డు అందుకున్నారు .2020వ సంవత్సరానికి వసంత్ “శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగళమ్ ” అనే చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా, ఇదే సినిమాకు లక్ష్మి ప్రియా చంద్ర మౌళికి సహాయ నటిగా , శ్రీకర్ ప్రసాద్ కు ఉత్తమ ఎడిటర్ గా అవార్డులను వచ్చాయి. .ఈ చిత్రం వేర్వేరు కాలాలకు సంబంధించిన ముగ్గురు మహిళల జీవిత కథ. విహానంతరం వారి జీవితం, అందులో ఎదురయ్యే కష్ట నష్టాలు , వారి మానసిక వ్యధ ను వసంత్ తెర పై అద్భుతంగా మలచారు . తమిళనాడు లోని మహిళలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా చేశారు . .ఈసినిమా ఇప్పటికే తమిళనాడులో సంచలనం కలిగిస్తుంది . వసంత్ 1990లో ” కెలాడి కన్మణి ” సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అయ్యాడు . ఈ సినిమాకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ సినిమాగా గుర్తించి అవార్డు నిచ్చింది .


వసంత్ సాయి తో కలసి నేను 64వ జాతీయ అవార్డుల కమిటీలో పనిచేసే అవకాశం కలిగింది . 24 రోజులపాటు ఢిల్లీ లోని అశోక హోటల్ లో వున్నాము . రోజు ఉదయం ఒకే కారులో సినిమాలు చూడటానికి సిరిఫోర్ట్ ఆడిటోరియం కు వెళ్లేవాళ్లం . సినిమా అంటే వసంత్ కు ప్రాణం . సినిమా మీడియం గురించి పూర్తి అవగాహన వుంది . ఆయనపై ఎక్కువగా తన గురువు దర్శకుడు కె .బాలచందర్ ప్రభావం వుంది . ప్రతి రోజు ఎదో ఒక సందర్భంలో బాల చందర్ గురించి ప్రస్తావించేవారు . బాల చందర్ చివరి రోజుల్లో ఆయనతో ఎక్కువ సమయం గడిపానని చెప్పేవాడు . అంతే కాదు సినిమా లాంటి శక్తివంతమైన సాధనాన్ని సమాజ చైతన్యం కోసం ఉపయోగించాలనేవారు .


వసంత్ కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా “శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగళమ్ “. ఇది వేర్వేరు కాలాలకు సంబంధించిన ముగ్గురు మహిళల జీవిత కథ . ఈ సినిమా భవిష్య తరాల కోసం జపాన్ మ్యూజియం లో భద్రపరచడం నిజంగా భారతీయులందరికీ గర్వ కారణం . ఈ సినిమాను భారత ప్రభుత్వం కూడా గుర్తించి ఆ మూడు అవార్డులను ప్రకటించడం అభినందనీయం .

….. భగీరథ