తల్లిని సన్మానిస్తూ ‘వైభవం’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – 23న ఘనంగా విడుదల

తమకు జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయడమే కాకుండా… కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి, సినిమా రంగంలో తమ ఉనికిని చాటుకోవాలన్న తమ తపనను కూడా ప్రోత్సహించిన తమ మాతృమూర్తిని సాదరంగా సత్కరించుకున్నారు “దర్శకహీరో ద్వయం” సాత్విక్ – రుత్విక్.

విద్యాధికులైన ఈ సోదరుల్లో.. తమ్ముడు సాత్విక్ దర్శకుడిగా అన్నయ్య రుత్విక్ హీరోగా పరిచయమవుతూ… తల్లి రమాదేవి నిర్మాతగా రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వైభవం” ఈ శుక్రవారం (మే 23) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన “వైభవం” ప్రి – రిలీజ్ వేడుకలో… తమ మాతృమూర్తి రమాదేవిని సాదరంగా సత్కరించుకున్నారు హీరో రుత్విక్ – డైరెక్టర్ సాత్విక్. అంతేకాదు తమ మాతృమూర్తే ముఖ్య అతిథిగా వేడుకను నిర్వహించుకున్నారు.

“చిన్నప్పటి నుంచి… చదువులో, ఆటపాటల్లో అన్నిటా ముందుండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకుని, తనకు ఎనలేని పుత్రోత్సాహం పంచి.. తమ ప్యాషన్ కోసం ఉద్యోగాలు విడిచిపెట్టి.. “వైభవం” చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్న తన బిడ్డలు… ఈ రంగంలోనూ విజయబావుటా ఎగురవేస్తారనే నమ్మకం తనకుందని” అన్నారు స్వతహా లాయర్ అయిన రమాదేవి. “తమ మాతృమూర్తి తమ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదని, “వైభవం” చిత్రం తమకు సినిమా రంగంలోనూ మంచి ఆరంభం ఇస్తుందని” హీరో రుత్విక్, దర్శకుడు సాత్విక్ పేర్కొన్నారు.

ఇంటిల్లిపాదీ కలిసి చూసి ఆస్వాదించతగ్గ చిత్రంగా మలిచిన “వైభవం” ఈనెల 23, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోందని, కుటుంబ విలువలతోపాటు… మానవతా విలువలు, భావోద్వేగాలు, సునిశిత హాస్యం కలగలిసిన ఈ చిత్రానికి అన్ని వర్గాల వారు పట్టం కడతారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తుండడం గర్వంగా ఉందని హీరోయిన్ ఇక్రా ఇద్రిసి అన్నారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన కె.ఎల్.ఎన్, అనంత్, కూడా పాల్గొని.. “వైభవం” చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.