ప్రముఖ నటుడు డైలాగ్‌కింగ్‌ ‘సాయికుమార్’ కు సన్మానం !!

గౌరవంగా, కించిత్‌ గర్వంగా ఉంది– డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌


ప్రముఖ నటుడు డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌ను ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన దేశ ప్రధాని నరేంధ్రమోడి నేతృత్వంలో 2021 మార్చి 12న ప్రారంభమై 2022 ఆగస్టు 15వరకు 75వారాలపాటు జరిగే కార్యక్రమమే ‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీ శాఖవారు అనేక రంగాల్లో లబ్దప్రతిష్ఠులైన కొంతమందిని ఎంపికచేసి సత్కరించారు. తోలుబొమ్మలాట కళాకారులు పద్మశ్రీ దాలవాయి చలపతిరావు, నటుడు సాయికుమార్, గాయని షణ్ముఖప్రియను సన్మానించారు.

ఈ సందర్భంగా సన్మాన గ్రహితల్లో ఒకరైన సాయికుమార్‌ మాట్లాడుతూ– ‘‘ సంస్కారం అమ్మది, స్వరం నాన్నది, అనుగ్రహం కళామతల్లిది, అభిమానం మీ అందరిది. నేను రీల్‌ హీరో అయితే నన్ను అభిమానించే అభిమానులే రియల్‌ హీరోలు. భారతీయులుగా పుట్టడం మనందరి అదృష్టం. ఈ వేదికపై సన్మానించిన చలపతిరావుగారు పదో ఏట, సింగర్‌ షణ్ముఖ ప్రియ ఐదో ఏట, నా నట ప్రయాణం పదకొండో ఏట ప్రారంభమవ్వటం ఈ వేడుకలో యాధృశ్చికంగా జరిగి ఉండొచ్చు. నా ముందుతరానికి చెందిన చలపతిరావు గారిని, నా తర్వాత తరం షణ్ముఖ ను అలాగే నా తరానికి ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసి ఇంత గొప్ప సభలో సన్మానించటాన్ని గౌరవంగా, కించిత్‌ గర్వంగా భావిస్తున్నా. ఇంతటి గొప్ప కార్యక్రమానికి కారణమైన తెలుగు రాష్ట్రాల ఐటీ డిపార్ట్‌మెంట్‌ వారికి వారి చీఫ్‌ కమీషనర్‌ శ్రీయుతులు అతుల్‌ ప్రణయ్‌ గారికి కృతజ్ఞతలు’’ అన్నారు.