అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూసారు

అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూసారు అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె వయసు 76 ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె ఈ రోజు ఉదయం కన్నుమూసారు. జయంతి విషయానికొస్తే.. ఆమె ప్రముఖ కన్నడ సినిమా ‘జేను గూడు’ సినిమాతో 1963లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం ‘భార్య భర్తలు’. ఈమె తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అప్పట్లోనే 1960, 70, 80లలో జయంతి తన చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా మూడు దశాబ్దాలుగా హీరోయిన్‌గా నటించింది.

ఈమె కేవలం తెలుగు, కన్నడ చిత్రాలకే పరిమితం కాలేదు. తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా ఏడు అవార్డులను అందుకుంది. అంతేకాదు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 1965లో ‘మిస్ లీలావతి’ సినిమాకు గాను ఉత్తమనటి రాష్ట్రపతి అవార్డు అందుకుంది. ఈమెకు కన్నడ ప్రభుత్వం అభినయ శారద అనే బిరుదు కూడా ప్రధానం చేసారు. ఈమె అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని బళ్లారిలో 6 జనవరి 1945లో జన్మించింది. ఈమె ప్రముఖ నటుడు దర్శకుడు పేకేటి శివరాం‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకు కృష్ణ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు.