శ్రీ నందమూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా “శ్రీ తిరుపతి వెంటేశ్వర కళ్యాణం” చిత్రం ప్రత్యేక ప్రదర్శన

వెండితెర కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఆయన సొంతగా సినిమా థియేటర్లు కూడా నిర్మించారు. వాటిలో గుంటూరు జిల్లా తెనాలిలోని రామకృష్ణ(పెమ్మసాని) థియేటర్ ఒకటి.

ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెనాలిలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నటించిన సినిమాలను ఏడాదిపాటు ప్రదర్శించే కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. పై థియేటర్లో సినిమాలు చూసేందుకు వస్తున్న ప్రేక్షకుల్ని చూస్తుంటే ఎన్టీఆర్​సినిమాలపై అభిమానం ఇప్పటికీ తగ్గలేదనే విషయం రుజువు అవుతోంది.

రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2న “శ్రీ తిరుపతి వెంటేశ్వర కళ్యాణం” సినిమాని ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు.
అలానే శతజయంతి ఉత్సవాలలో భాగంగా వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల నుండి సంక్రాంతి సంబరాల వరకు ఎన్టీఆర్ గారి కుమారుడు, రామకృష్ణ సినీ స్టూడియోస్ మేనేజింగ్ పార్టనర్ అయిన శ్రీ నందమూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో- పర్యవేక్షణలో ఎన్టీఆర్ గారి సొంత సినిమాల ప్రదర్శన జరుగుతుండడం విశేషం!
తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి పండుగ- సినిమాల పండగగా రూపాంతరం చెందడంలో ప్రధాన పాత్రను పోషించిన ఘనత ఎన్టీఆర్ గారికీ, ఆయన సొంత సంస్థకు దక్కుతుంది. అటువంటి ఎన్టీఆర్ గారి సొంత చిత్రాలను ఆయన శతజయంతి ఉత్సవాలలో కూడా సంక్రాంతి వేడుకగా ప్రదర్శిస్తుండడం.. ఆ కార్యక్రమానికి ఆయన కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారే పర్యవేక్షణ చేయడం మరింత విశేషం గా పేర్కొనవచ్చు.