చియాన్ విక్రమ్ 62వ ప్రాజెక్ట్‌లో ప్రముఖ నటుడు ‘ఎస్ జే సూర్య’

విలక్షణ నటుడు, ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం తన 62వ ప్రాజెక్ట్‌ను ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం చియాన్ 62 అని వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టులోకి విలక్షణ నటుడు ఎస్ జే సూర్య కూడా ఎంట్రీ ఇచ్చారు. నేడు ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఎస్.యు. అరుణ్ కుమార్ గతంలో ‘పన్నయ్యరుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, ‘సింధుబాద్’, ఇటీవలి హిట్ ‘చిత’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చియాన్ విక్రమ్ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ గతంలో ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు విలక్షణ నటుడు ఎస్‌జె సూర్య ఎంట్రీతో మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం వెల్లడించింది.

చియాన్ విక్రమ్, ఎస్ జే సూర్యల కలయికతో అభిమానులలో అంచనాలను పెంచడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తిని క్రియేట్ చేసింది.