Bandla Sirisha: అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తెలుగు యువతి

అమెరికాలో గుంటూరు యువతి చరిత్ర సృష్టించేందుకు అంతరిక్షయానానికి సిద్ధమవుతోంది. ఈ నెల 11వ తేదీన తమ అంతరిక్ష వాహక నౌక యూనిటీ -22 ను ప్రయోగించనున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది. ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు ప్రకటించింది.ఈ బృందంలో తెలుగు మూలాలు ఉన్న బండ్ల శిరీష.. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు.

బండ్ల శిరీష ఫ్యామిలీది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కాగా, ఆమె తల్లిదండ్రులు డాక్టర్ అనురాధ, డాక్టర్ మురళీధర్‌రావు చాలా ఏళ్ల క్రితమే ఈ కుటుంబం అమెరికాలోని స్థిరపడ్డారు. అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్లో శిరీష పట్టభద్రురాలు అయ్యారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం.. 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.

కల్పనా చావ్లా, ఇండియన్‌ అమెరికన్‌ సునీతా విలయమ్స్‌ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన బండ్ల శిరీష చేరారు.