గీతాగాన, ప్రవచన,ప్రచారకర్త ఎల్.వి. గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ “

ప్రసిద్ధ గాయకులు, గీతాగాన,ప్రవచన ప్రచారకర్త శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లోని “మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం” “గౌరవ డాక్టరేట్ ” ప్రకటించింది.

భారతీయ సంస్కృతి ని పరిరక్షించడం లో భాగంగా – భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితంగా గాన చేసి వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి అంతటితో తన భాధ్యత తీరిపోయిందని భావించకుండా -స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్నందుకు శ్రీ గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ ” ను ప్రకటిస్తున్నామని పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.జి .విజయకుమార్ తెలియజేసారు.

మే 24, 2023 ఉదయం 11 గంటలకు కాఠీ మార్గ్ లోని విక్రం కీర్తి మందిరం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్ ) లో జరిగే మహర్షి పాణిని సంస్కృ త్ ఏవం వైదిక్ విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం లో ఆయనకు గౌరవ డాక్టరేట్ తో సన్మానించునట్లు తెలిపారు.

ఈ సందర్బంగా గీతాగాన, ప్రవచన , ప్రచారకర్త భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి. గంగాధర శాస్త్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ –

మధ్యప్రదేశ్ గవర్నరు, ఆ రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాల కులపతి శ్రీ మంగుభాయ్ పటేల్ కు, మహర్షి పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ విజయ్ కుమార్ సి.జి కు, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు , ఉన్నత విద్యాశాఖా మంత్రి శ్రీ మోహన్ యాదవ్ లకు వినమ్ర పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

కాగా – ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా తాను 17 ఏళ్లుగా చేస్స్తున్న కృషిని గుర్తించిన భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ , తెలుగువాడైన శ్రీ పి . మురళీధరరావు ప్రభత్వం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా తనకీ గౌరవం దక్కిందని, అందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ న్నా న ని గంగాధర శాస్త్రి అన్నారు.

సంస్కృత వ్యాకర్త అయినా ‘పాణిని మహర్షి ‘ పేరు తో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందడం సముచితంగా, అదృష్టంగా భావిస్తున్నా న ని అన్నారు. తనకు లభించిన ఈ గౌరవం – తనకు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, తన 17 ఏళ్ళ భగవద్గీతా ప్రయాణం లో సహకరించిన భార్యాబిడ్డలకు, మార్గ నిర్దేశకత్వం చేసిన గురువులకు, ప్రపంచం నలుమూలల నుండి చేయూతనందించిన భగవద్గీత అభిమానులకే చెందుతుందని, తాను కేవలం శ్రీ కృష్ణుడు ఉపయోగించుకున్న సాధనం మాత్రమేనని గంగాధర శాస్త్రి అన్నారు.

స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ‘భగవద్గీత ‘ పునాదుల పై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా గీతా ప్రచారం తో పాటు –

  • పేద విద్యార్థులకు, అనాధ బాలలకు వికలాంగులకు , వృద్ధా శ్ర మాలకు చేయూత
  • గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ
    *ఆయుర్వేద, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ

వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గంగాధర శాస్త్రి చెప్పారు.

ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక సామాజిక సేవాక్షేత్రంగా తెలుగునాట ‘ భగవద్గీతా యూనివర్సిటీ ‘ స్థాపనే పరమ లక్ష్యం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ కృషి చేస్తుందని చెబుతూ మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంధం ‘భగవద్గీత’ ను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని, గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించాలని కోరారు .