మోడరన్ మోడీగా రాజేంద్ర ప్రసాద్

గతంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు అవార్డులు అందుకున్న డ్రీమ్‌ చిత్ర దర్శకుడు, ప్రవాసాంధ్రుడు భవానీశంకర్‌ తాజాగా క్లైమాక్స్‌ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌, పృథ్వీరాజ్‌, శివశంకర్‌ మాస్టర్‌ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా సాషాసింగ్‌, రమేష్‌, చందు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై పి.రాజేశ్వర్‌రెడ్డి, కె.కరుణాకర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన పి.రాజేశ్వర్‌రెడ్డి తెలియజేస్తూ పొలిటికల్‌ సెటైర్‌ నేపథ్యంలో సాగే మర్డర్‌ మిస్టరీ ఇది. మా మా సంస్థకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమవుతుంది. కథాంశంతో పాటు చిత్రీకరణ విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో తక్కువ పాత్రలే ఉంటాయి కానీ ప్రతీ పాత్ర కూడా ఒక హీరోలాగానే అనిపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. హైదరాబాద్‌లో మొత్తం షూటింగ్‌ జరుపుతున్నాం.

ఒక పాటను రామోజీ ఫిలింసిటీలో సెట్‌ వేసి తియ్యబోతున్నాం అని చెప్పారు. దర్శకుడు భవానీశంకర్‌ మాట్లాడుతూ, ఇందులో రాజేంద్రప్రసాద్‌ పాత్ర పేరు మోడీ. ఆ పేరు ఎందుకు పెట్టాం అన్న అంశం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్‌ ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారు. కళ్లద్దాలు, టాటూస్‌కి శ్రద్ధ తీసుకున్నాం. ఇందులో మరో కీలక పాత్రను ఓ ప్రముఖ వ్యక్తి చేస్తున్నారు. ఈ చిత్రంలోని సంగీతం కూడా చాలా కొత్తగా ఉంటుంది. మొత్తం మూడు పాటలున్నాయి అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రాజేష్‌, ఛాయాగ్రహణాన్ని రవికుమార్‌ నీర్ల సమకూరుస్తున్నారు.