ఈసారి ‘మా’లో ఎన్నికలు ఉండవా? మరి ఈ గోలంతా ఎందుకు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు… 2017 నుంచి వివాదాస్పదంగా మారుతున్న ఈ ఎన్నికలు ఈ ఏడాది మరింత రచ్చ లేపుతున్నాయి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తుండడం, అతన్ని ఔట్ సైడర్ అంటూ కొంతమంది విమర్శించడం… ప్రకాష్ రాజ్ కి పోటిగా యంగ్ హీరో మంచు విష్ణు అధ్యక్ష ఎన్నికల రేస్ లోకి రావడం, కృష్ణ లాంట సీనియర్ హీరోలు అతనికి సపోర్ట్ చేయడం… ఈ మధ్యలో జీవిత, హేమలు కూడా మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మేమూ పోటీ చేస్తున్నాం అంటూ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో… 800 మంది సభ్యులు కూడా లేని మా అసోసియేషన్ లో అసలు ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది అనేది కామన్ సినీ అభిమాని కూడా అర్ధం కాని విషయంగా మారింది.

‘మా’లో ఎన్నికలు ప్రకటించక ముందే అసోసియేషన్ లో రోజు రోజుకి పరిస్థితి చెయ్ దాటుతూ ఉంది. మీడియా చానెల్స్ కి ఎక్కి బ్యాచ్లుగా విడిపోయి మరీ ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్‌ స్పందించారు. ‘గాడి తప్పిన ‘మా’ను మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈసారి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేసి మంచి కమిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. దీనికోసం ‘మా’లో కొన్ని విధానాలు మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే నాతో పాటు చిరంజీవి, మోహన్‌బాబు, జయసుధ, కృష్ణంరాజు ఇంకా మిగిలిన వాళ్లమంతా సమావేశం అవుతున్నాం’ అని మురళీమోహన్‌ తెలిపారు. ఎన్నికలు ఎలాగో ఉండకుండా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ గొడవలకి, విమర్శలకి ఫుల్ స్టాప్ పడితే బాగుండు.