పాటల సందడిలో ‘రేవంత్ రెడ్డి’

రంభ ప్రొడక్షన్స్ పతాకంపై రంభ ప్రసాద్ నిర్మాతగా, గద్దె శివకృష్ణ చౌదరి సమర్పకుడిగా, వెల్లంకి దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” రేవంత్ రెడ్డి “. ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమం హైదరాబాద్ లోని రాగ స్టూడియో లో ప్రారంభమైంది. రాజ్ కిరణ్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తుండగా.. మొట్టమొదటిగా పాటల రచయిత మూడడ్ల ఉమా మహేశ్వర రావు రాసిన వన్నె చిన్నెల చిన్నది, తళుకు బెళుకు లున్నది అనే పాటతో రికార్డింగ్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్ కిరణ్ మంచి సంగీత దర్శకుడని, పాటలన్నీ ఖచ్చితంగా హిట్ అవుతాయన్నారు.

మా యూట్యూబ్ చానెల్ కు రాజ్ కిరణ్ తో దాదాపు 200 పాటలకు మ్యూజిక్ చేపించానని, సినిమా టైటిల్ బాగుందని, ఈ సినిమాకు నా సంపూర్ణ సహకారం వుంటుందని తెలిపారు. తర్వాత మరో అతిథి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ దర్శక నిర్మాతలిద్దరూ నాకు బాగా మిత్రులని, సినిమా ఇండస్ట్రీలో పూర్తి అవగాహన కల్గిన వీరిరువురి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావున ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపారు.

ఇక నిర్మాత రంభ ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రంలో 5 సాంగ్స్ వుంటాయని, మంచి క్వాలిటీ తో సాంగ్స్ రికార్డు చేస్తున్నామని, డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ కంటిన్యు గా వుంటుందని తెలిపారు. దర్శకుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సినిమా టైటిల్ చూసి ఎవ్వరూ అపోహ పోవాల్సిన అవసరం లేదని, సినిమా చూసిన తర్వాత మీరే మొచ్చుకుంటారని, 40 సంవత్సరాల నా సినీ జీవితంలో నాకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ దర్శక నిర్మాతలిద్దరూ బాణీలు సమకూర్చడంలో నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారని అందుకే నా టాలెంట్ నంతా వుపయోగించి మంచి పాటలను అందించగలిగానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు గిరియాదవ్, బద్రి, రాము, నరేంద్ర, సీనియర్ మీడియేటర్ శంకర్ పాల్గోని టీమ్ కు అభినందనలు తెలిపారు.