విలువలే ప్రాణంగా బతికిన యలమంచి హరికృష్ణ

గాంధీ జయంతి . రోజున దేశమంతా ఆ మహనీయుని స్మరించుకుంటుంది . తెలుగు సినిమా రంగంలో విలువలకు ప్రాధాన్యమిచ్చి జీవితాంతం పాటించిన మానవతావాది యలమంచి హరికృష్ణ జయంతి కూడా ఈరోజే . . అభిరుచి కలిగిన హరి కృష్ణ సామాజిక స్పృహ తో నిర్మించిన సినిమాలు అనేక అవార్డులను , విమర్శకుల ప్రశంశలను అందుకున్నాయి .
సినిమా రంగంలో ఆయన వారసులు ఎవరూ లేరు . ఆయన తండ్రి వామపక్ష భావాలున్న కమ్యూనిస్టు నాయకుడు . ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే అనుకోని సంఘటనతో ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది . చిన్న వయసులోనే కుటుంబ బరువు , బాధ్యతలు హరికృష్ణ తీసుకున్నారు . అలా సినిమా రంగంలోకి తెలియకుండానే వచ్చారు . ఉద్యోగినా ప్రారంభమైన ఆయన జీవిత ప్రస్థానం అనూహ్యంగా జరిగింది.


తెలుగు సినిమా రంగంలో పంపిణీదారుగా , నిర్మాతగా ఎదిగి ఒదిగిన మానవతావాది , విలువలతో చివరి వరకు బ్రతికిన ఉత్తమోత్తముడు హరి కృష్ణ .
ఎందరికో స్ఫూర్తినిచ్చే యలమంచి హరికృష్ణ జీవితం గురించి తెలుసుకుందాం.
ఐదు దశాబ్దాల సినిమా .జీవితంలో గ్రామర్ తప్ప గ్లామర్ ను వంటపట్టించుకొని మంచి మనిషి , ఉత్తమాభి రుచులు కలిగిన వ్యక్తి యలమంచి హరికృష్ణ.


తండ్రి నేర్పిన సంస్కారం , నడిచిన మార్గాన్ని జీవిత చరమాకం వరకు మర్చిపోకుండా ఆచరించిన హరికృష్ణ పంపిణీరంగంలోనూ , నిర్మాణ రంగంలోనూ, చిత్ర రంగ సంస్థల నిర్వహణలోనూ తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి , ప్రభావశీలి .
కృష్ణ జిల్లా మేడూరు గ్రామంలో యలమంచి వెంకట కృష్ణయ్య , సరస్వతి దంపతులకు కస్తూరిబాయి , విద్యావతి తరువాత మూడవ సంతానంగా హరికృష్ణ అక్టోబర్ 2, 1936వ సంవత్సరంలో జన్మించారు .
వెంకటకృష్ణయ్య తొలుత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు . అయితే అప్పట్లో ఆంధ్ర దేశంలో కమ్మూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది . కమ్మూనిస్టుల భావాలు , సిద్ధాంతాలకు ఆనతి యువకులు ఎక్కువ ఆకర్షితులు అవుతుండేవారు . వెంకట కృష్ణయ్య కూడా కమ్మూనిస్టు నాయకుల విన్యాసాలకు ప్రభావితమై ఆపార్టీలో చేరారు .
కమ్మూనిస్టు భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వెంకట కృష్ణయ్య పనిచెయ్యడం మొదలు పెట్టారు . కుటుంబానికి దూరంగా ఉంటూ పార్టీకే అంకితమైన వెంకట కృష్ణయ్య అనతి కాలంలోనే నాయకుడుగా ఎదిగారు . ఆయన ఉపన్యాసాలకు ప్రజలు స్పందించడం మొదలు పెట్టారు . సరిగా అప్పుడే ఆయన ప్రభుత్వము దృష్టిలో పడ్డాడు . పోలీసుల వేట మొదలైంది . ఆయన వారి నుంచి తప్పించుకోవడం కోసం అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు . ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలించడం మొదలు పెట్టారు . చివరకు వెంకట కృష్ణయ్య ఆచూకి కనిపెట్టిన పోలీసులు ఆయన్ని బంధించి కాల్చివేశారు.
ఊహించని ఈ ఘటన ఆ కుటుంబాన్ని కలవరపెట్టింది , కన్నీరు కార్పించింది . వెంకట కృష్ణయ్య కు ముందే తల్లి సరస్వతి చనిపోవడంతో పిల్లల ఆలనాపాలనా నాయనమ్మ చూస్తుంది . కమ్మూనిస్టు నాయకులు వచ్చారు , కుటుంబాన్ని ఓదార్చారు, అండగా ఉంటామని హామీ ఇచ్చారు . అప్పుడు హరికృష్ణ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు . అప్పటికే ఇద్దరు అక్కల వివాహం జరిగింది .
అక్కలు , నాయనమ్మ వారిస్తున్నా , ఇక చదువు కొనసాగించమని , వుద్యోగం చూసుకొని కుటుంబానికి సహాయపడతానని విజయవాడ వెళ్లిపోయారు . అదే హరికృష్ణ జీవితాన్ని మలుపు తిప్పింది .
విజయవాడ వెళ్లిన తరువాత తెలిసినవారి ద్వారా నవయుగ సినిమా పంపిణీ సంస్థలో రిప్రజెంటిటివ్ గా చేరారు . ఆరోజుల్లో సినిమా రెప్రజెంటిటివ్ ను థియేటర్ యజమానులు ప్రలోభపెట్టి అక్రమార్జన చేస్తుండేవారు . అయితే హరికృష్ణ నిజాయితీగా పనిచేసేవారు . ఎలాంటి ప్రలోభాలకు లొంగేవారు కాదు . 12 సంవత్సరాలు నవయుగ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు . అప్పట్లో పంపిణీ సంస్థల యజమానులు హరికృష్ణను బాగా అభిమానించేవారు . అలా కాంగ్రెస్ నాయకుడు , ఆంధ్ర జ్యోతి పత్రిక యజమాని , లక్ష్మీ ఫిలిమ్స్ అధినేత కె .ఎల్ .ఎన్ . ప్రసాద్ దృష్టిలో పడ్డారు . 1968లో ప్రసాద్ గారి ఆహ్వానంతో లక్ష్మీ ఫిలిమ్స్ పంపిణీ సంస్తలో మేనేజర్ గా చేరారు . ఈ మార్పు హరి కృష్ణను సినిమా రంగానికి మరింత చేరువ చేసింది . లక్ష్మీ ఫిలిమ్స్ కొక స్థాయిని తీసుకురావడంలో హరికృష్ణ గణనీయమైన పాత్ర నిర్వహించారు .


నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావు , దర్శకుడు తాతినేని రామా రావు , హీరో శోభన్ బాబు సహాయ సహకారం , ప్రోత్సాహంతో 1977 వ సంవత్సరంలో సికిందరాబాద్ లో హరి కృష్ణ “శ్రీ లక్ష్మీ చిత్ర ” పంపిణీ సంస్థను మొదలు పెట్టారు . దీనికి పద్మశ్రీ నందమూరి తారక రామారావు స్వహస్తాలతో ప్రారంభించారు . తెలుగు సినిమా రంగంలో వున్న ఎంతో మంది నటులు, నిర్మాతలు, దర్శకులు వచ్చి హరి కృష్ణ కు శుభాకాంక్షలు తెలిపారు . ఆ తరువాత సంవత్సరానికి విజవాడలో లక్ష్మీ చిత్ర పంపిణీ సంస్థను నెల కొల్పారు .
అటు వ్యాపార సినిమాలతో పాటు , అభిరుచి కలిగిన సినిమాలు , వామ పక్ష సినిమాలు , సామాజిక స్పృహతో నిర్మించిన సినిమాలకు చేయూతనివ్వడం లో హరికృష్ ముందుండేవారు . కేవలం వ్యాపారమే ప్రధానంగా చూసేవారు కాదు . అందుకే హరికృష్ణ కు ఆనతికాలం లోనే గుర్తిపు , గౌరవం వచ్చాయి .
1984వ సంవత్సరంలో కృష్ణ చిత్ర అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి టి కృష్ణ దర్శకత్వంలో “వందేమాతరం ” సినిమా తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు . తరువాత ముత్యాల సుబ్భయ్య తో “అరుణకిరణం “,టి . కృష్ణ తో “దేవాలయం “,ముత్యాల సుబ్బయ్య తో “ఇదా ప్రపంచం “, “మమతల కోవెల “, “ఇన్స్పెక్టర్ ప్రతాప్ “, రేలంగి నరసింహా రావు తో “పద్మావతి కళ్యాణం ” , బాపుతో తో “కల్యాణ తాంబూలం ” ,కోడి రామ కృష్ణతో “గాడ్ ఫాథర్ ” చిత్రాలను నిర్మించారు . తన సినిమాల ద్వారా ఎందరో నటి నటులను , దర్శకులను పరిచయం చేసి , ప్రోత్సహించారు . .
సామాజిక సమస్యలతో నిర్మించిన చిత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డులను ప్రదానం చేసి సత్కరించింది .
సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన హరి కృష్ణ అంటే అందరూ ఎంతో అభిమానంగా ఉండేవారు . రామారావు, నాగేశ్వర రావు , శోభన్ బాబు , కృష్ణ , కృష్ణం రాజు , చిరంజీవి ,, నిర్మాతలు డి .వి .ఎస్ రాజు, రామానాయుడు , ఎమ్మెస్ రెడ్డి , వీబీ రాజేంద్ర ప్రసాద్, అట్లూరి పూర్ణ చంద్ర రావు , తాతినేని రామారావు మొదలైన వారు హరికృష్ణను ఆత్మీయులుగా భావించేవారు .
1979లో హైద్రాబాద్లో ప్రారంభమైన ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలికి కార్యదర్శిగా , 1993లో హైద్రాబాద్లో ప్రారంభమైన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కు సంయుక్త కార్యదర్శిగా , నంది అవార్డుల కమిటీ సభ్యుడుగా , 1986లో హైదరాబాద్ లో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఆహ్వాన సంఘ సభ్యుడు గా హరి కృష్ణ సేవలందించారు . నిర్విరామంగా సినిమా రంగానికి అంకితమైన హరికృష్ణ 2013 సెప్టెంబర్ 13న ఇహలోక యాత్ర ముగించారు . .
హరి కృష్ణకు రాజ్య లక్ష్మి తో చిన్నప్పుడే వివాహమైంది . ఈ దంపతులకు రవీంద్ర బాబు , అనిల్ బాబు, అజయ్ కుమార్ ముగ్గురు సంతానం . హరి కృష్ణ మేనల్లుడు కాట్రగడ్డ ప్రసాద్ ఆయన మార్గదర్శ కత్వములో సినిమా రంగంలో పంపిణీదారుగా వసుధ చిత్రను ప్రారంభించి అనంతరం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలను రూపొందించారు . ప్రస్తుతం కాట్రగడ్డ ప్రసాద్ దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వున్నారు .
తెలుగు సినిమా రంగంలో యలమంచి హరి కృష్ణ .నిర్మించిన చిత్రాల ద్వారా ఆయన స్మృతి ఎప్పటికీ గుర్తుంటుంది. .

  • భగీరథ