కరోనా కారణంగా ‘తెలంగాణ దేవుడు’ చిత్ర విడుదల వాయిదా!!

1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఒక నిఘంటువు. అటువంటి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమనాయకుని చరిత్ర అందరికీ తెలియాలనే.. ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని రూపొందించామని అంటున్నారు దర్శకనిర్మాతలు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉద్యమనాయకుడి పాత్రలో ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 23న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది. అయితే ప్రస్తుతం కరోనా ఉదృతిని దృష్టిలో పెట్టుకుని, ప్రజల శ్రేయస్సును కోరుతూ.. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో చిత్రయూనిట్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

మాక్స్‌ల్యాబ్ సిఈఓ మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాం. కానీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రజల శ్రేయస్సును కోరుతూ.. సినిమాని వాయిదా వేస్తున్నాము. పరిస్థితులన్నీ చక్కబడి, ప్రజల జీవన స్థితుల్లో మళ్లీ మంచి రోజులు రావాలని కోరుతున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. సెకండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దయచేసి ఎవరూ అశ్రద్ధగా ఉండకండి. మేము తెలంగాణ దేవుడుగా భావించే సీఎం కేసీఆర్‌గారికి కూడా కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని మా చిత్రయూనిట్‌ తరుపున కోరుకుంటున్నాము. ప్రజలెందరో ఇప్పుడు కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సినిమాని విడుదల చేయడం ఏమంత శ్రేయస్కరం కాదని భావిస్తూ.. మా నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాని ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తాం..” అని అన్నారు.

ఈ సమావేశంలో దర్శకుడు హరీష్‌ వడత్యా మాట్లాడుతూ.. ‘‘నిజంగా ‘తెలంగాణ దేవుడు’ వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి, చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. రీసెంట్‌గా చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించాము. ప్రీ రిలీజ్‌ వేడుకను సక్సెస్‌ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న గ్రాండ్‌గా విడుదల చేయాలని భావించాం. అందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. కానీ కరోనా మహమ్మారి ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో తెలియంది కాదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి ఆవహించేసింది. రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ.. మీ ప్రాణాలను కాపాడుకోవాలని కోరుతున్నాము..’’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ మొహమ్మద్ ఖాన్ కూడా పాల్గొన్నారు.

ఫ్రెండ్లీ హీరో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
మూల కథ, నిర్మాత: మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మెహమూద్ ఖాన్
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌
పీఆర్వో: బి.ఎస్‌. వీరబాబు