‘లూసీఫ‌ర్’ నుంచి వినాయ‌క్‌ను త‌ప్పించ‌డం వెన‌క రీజ‌న్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ‘ ఆచార్య’ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దీని త‌ర్వాత మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన‌ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌లో న‌టించ‌నున్నాడు. లూసీఫర్ తెలుగు రీమేక్ హక్కులను మెగాప‌వ‌ర్ స్టార్ రాంచర‌ణ్ ఇప్ప‌టికే కోనుగోలు చేశాడు. మ‌లయాళంలో విడుద‌లైన‌ ‘లూసీఫర్’ సినిమా చాలా బాగుంటుంద‌ని, తెలుగులో చిరంజీవి చేస్తే బాగుంటుంద‌ని రాంచ‌ర‌ణ్‌కి సుకుమార్ చెప్పాడ‌ట‌. దీంతో సుకుమార్ కోరిక మేర‌కు రాంచ‌ర‌ణ్ తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను కొనుగోలు చేశాడు. చిరుతో సుకుమార్ ఈ సినిమా చేయాల్సి ఉండ‌గా.. దీని కోసం స్క్రీఫ్ట్‌లో కూడా సుకుమార్ ప‌లు మార్పులు చేశాడు.

కొన్ని కార‌ణాల వ‌ల్ల సుకుమార్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంతో సాహో డైరెక్ట‌ర్ సుజీత్‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీని స్క్రీఫ్ట్‌లో సుజిత్ కూడా మార్పులు, చేర్పులు చేయ‌గా.. అవి చిరంజీవికి నచ్చలేదట‌. దీంతో డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు ఈ ప్రాజెక్టు అప్ప‌గించ‌గా.. స్క్రీఫ్ట్‌లో వినాయ‌క్ కామెడీ ట్రాక్ యాడ్ చేశాడ‌ట‌. ఈ కామెడీ ట్రాక్ చిరంజీవికి నచ్చ‌లేద‌ట‌. దీంతో వినాయ‌క్‌ను కూడా ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పించి హ‌రీష్ శంక‌ర్‌కు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.

చిరుతో సినిమా చేయాల‌నే కోరిక అంద‌రి డైరెక్ట‌ర్ల‌కు ఉంటుంది. ఇప్పుడు అవ‌కాశం ద‌క్క‌డంతో చిరును కొత్త‌గా చూపించేందుకు హ‌రీష్ శంక‌ర్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. స్క్రీఫ్ట్‌ను హ‌రీశ్ ఇప్ప‌టికే సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం చిరు చేస్తున్న ఆచార్య సినిమా పూర్తైన త‌ర్వాత లూసీఫ‌ర్ తెలుగు రీమేక్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.