నాగార్జున ఇచ్చిన తొలి పారితోషికం చెక్‌ని భ‌ద్రంగా దాచుకున్న‌: ర‌వితేజ‌

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కామెడీ టైమింగ్‌తో సినీ ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డం త‌న‌ ప్ర‌త్యేక‌త‌. ర‌వితేజ కామెడీ టైమింగ్ చూడ‌టానికే ఆయ‌న‌ అభిమానులు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. త‌న ఇన్నేళ్ల సినీ ప్ర‌యాణంలో హీరోగా ఎన్నో హిట్స్ ప్లాపులు చ‌విచూశాడు. కానీ ఈ మ‌ధ్య వ‌రుస ఫ్లాపులతో స‌త‌మ‌వుతున్న ర‌వితేజ‌కు తాజాగా క్రాక్ సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ సినిమాలో ర‌వితేజ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీసు్ ఆఫీస‌ర్‌ పోతులూరి వీర‌శంక‌ర్‌గా థియేట‌ర్ల‌లో ఆక‌ట్టుకుంటున్నాడు.

ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. అయితే.. ర‌వితేజ కెరీర్ మొద‌ట్లో కొన్ని సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, ప‌లు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో ర‌వితేజ న‌టించారు. పూరీ జ‌గ‌న్నాథ్ ర‌వితేజ కాంబో‌లో తెరకెక్కిన సినిమాలు న‌టుడిగా మంచి గుర్తింపు సంపాదించ‌డంతో హీరోగా ర‌వితేజ వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారాడు. ఇక‌ క్రాక్ చిత్రం స‌క్సెస్ సంద‌ర్భంగా ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌వితేజ‌.. త‌న తొలి పారితోషికానికి సంబంధించిన ఆస్త‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించారు. 1996 సంవ‌త్స‌రంలో నాగార్జున హీరోగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన నిన్నేపెళ్లాడ‌తా సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాన‌ని.. ఆ సినిమాకు ప‌నిచేసినందుకు తొలి పారితోషికాన్ని 3500రూపాయ‌ల చెక్కును నాగార్జున గారి చేతుల మీదుగా పుచ్చుకున్నాన‌ని ర‌వితేజ తెలిపారు. అది తొలి పారితోషికం కాబ‌ట్టి ఆ చెక్కుని చాలా కాలం వ‌ర‌కు అపురూపంగా దాచుకున్నాన‌ని. ఆతర్వాత డ‌బ్బులు చాలా అవ‌స‌ర‌మై బ్యాంక్‌లో ఆ చెక్‌ను మార్చేసుకున్నాను అంటూ ర‌వితేజ చెప్పుకొచ్చాడు.