పాటలు మూడే… మేజిక్ మాత్రం తగ్గదు

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కోసం ఏం చేసినా ఓ లాజిక్, అంతకు మించిన మ్యాజిక్ ఉంటుంది. బాహుబలి ఆ విషయాన్ని ప్రపంచానికే తెలియజేసిన జక్కన ప్రస్తుతం రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ లతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా బల్గెరియాలో జరిగిన షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ వచ్చారు. త్వరలోనే చరణ్ పాత్రకి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కాబోతుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి అంతకు మించి అనుమానాలు ప్రశ్నలు కూడా ఉన్నాయి. రాజమౌళి సినిమాల్లో పాటలకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది, గురువు రాఘవేంద్రరావు లాగే ప్రతి పాటని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే చేయడంలో జక్కన దిట్ట. అయితే తన గత సినిమాలకి భిన్నంగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ అల్లూరి సీతారామరాజు, కొమురం భీం కథ కావడంతో ఆరు పాటల ఫార్ములాను మార్చేందుకు రాజమౌళి రెడీ అయ్యారట. ఈ ఇన్స్పైరింగ్ కథలో ఎక్కువ పాటలు పెట్టకుండా కేవలం మూడు పాటలు మాత్రమే ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో ఒక హల్చల్ చేస్తోంది. ఈ మూడు మెయిన్ సాంగ్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి, నేపథ్య సంగీతంలో మరో పాట వినిపించనున్నారట. మరి ఎప్పుడూ సాంగ్స్ తో స్పెషల్ మ్యాజిక్ చేసే రాజమౌళి, ట్రిపుల్ ఆర్ విషయంలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో తెలియాలి అంటే 2020 జులై 30 వరకూ ఆగాలి.