“డాటీ” అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతున్న మరో ప్రముఖ నిర్మాత

“మోహన్ మీడియా క్రియేషన్స్” అధినేత మోహన్ వడ్లపట్ల, మెక్విన్ గ్రూప్ యు.ఎస్.ఎ సంస్థతో కలసి తమ అయిదవ ప్రయత్నంగా పూర్తి అమెరికా నేపథ్యంలో ఒళ్లు గగుర్పొడిచే చైల్డ్ సెంటిమెంట్ థ్రిల్లర్ “డాటీ” చిత్రాన్ని రూపొందించబోతుంది. మిస్ యు ఎస్ ఏ ఇంటర్నేషనల్ 2019 విజేత “జో శర్మ“ హీరోయిన్ గా నటించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.

కమర్షియల్ చిత్రాలుగా విజయవంతమైన “మెంటల్ క్రిష్ణ”, “మల్లెపువ్వు” లాంటి చిత్రాలతో పాటు బంగారునంది సాధించిన “కలవరమాయె మదిలో” లాంటి హృద్యమైన సినిమాలు ప్రేక్షకులకు అందించి ఇప్పుడు యూత్ ని మైమరిపించే ట్రెండీ బ్లూ బస్టర్ “లవ్ 20-20” చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయనున్నారు.

అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న మోహన్ మీడియా క్రియేషన్స్ అధినేత మోహన్ వడ్లపట్ల ఈ “డాటీ” చిత్రానికి దర్శకుడిగా మెగాఫోన్ పట్టడం విశేషం. ఈ సందర్బంగా నిర్మాత దర్శకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ… ఇన్నాళ్లు నిర్మాతగా నన్ను ఆదరించిన మీరంతా, దర్శకునిగా నా తొలి ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆశీర్వదించి విజయవంతం చేయాలంటూ ప్రేక్షకులందరికీ వినమ్ర దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.