ఇప్పుడు ‘జెంటిల్‌మేన్’ వస్తే ‘శక్తి’లా ఉంటాడు- నిర్మాత కోటపాడి జె.రాజేష్

టీవీలో వీడియో జాకీ(వీజే)గా కెరీర్ స్టార్ట్ చేసి, అతి తక్కువ సమయంలో క్రేజీ స్టార్‌గా ఎదిగిన తమిళ హీరో శివ కార్తికేయన్. తమిళనాట మాస్‌లో అతడికి సూపర్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకులకూ శివ కార్తికేయన్ సుపరిచితుడే. ‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగులోనూ విజయాలు అందుకున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగులో శివ కార్తికేయన్‌ను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు.

శివ కార్తికేయన్ నటించిన తాజా తమిళ సినిమా ‘హీరో’. తమిళనాడులో గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు కోటపాడి జె.రాజేష్. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ‘అభిమన్యుడు’ చిత్రంతో దర్శకుడిగా తమిళ, తెలుగు భాషల్లో విజయాన్ని అందుకున్న పి.ఎస్. మిత్రన్ ఈ ‘శక్తి’కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ‘హలో’లో అఖిల్ సరసన, ‘రణరంగం’లో శర్వానంద్ సరసన నటించిన కల్యాణీ ప్రియదర్శన్ ఈ సినిమాలో కథానాయిక.

ఈ నెల 20న సినిమా విడుదల కానున్న సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ “సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రజల్లో ప్రస్తుత విద్యావ్యవస్థ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో తీశాం. తమిళనాడులో ప్రేక్షకులందరికీ సినిమా నచ్చింది. రివ్యూస్ చూడండి. తెలుగు ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలను. మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కరెంట్ సినారియో గురించి డిస్కస్ చేసిన సినిమా ‘శక్తి’. ప్రేక్షకులు అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సినిమా అంటే ‘జెంటిల్‌మేన్’ గుర్తుకు వస్తుంది. బేసికల్లీ… ఈ సినిమా ప్రజెంట్ డే ‘జెంటిల్‌మేన్’. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కరెక్ట్ చేయడానికి ‘జెంటిల్‌మేన్’ వస్తే ‘శక్తి’లా ఉంటాడు. దర్శకుడు మిత్రన్ ఎంత అద్భుతంగా సినిమా తీశారో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ‘అభిమన్యుడు’లో బ్యాంక్ మోసాల గురించి చర్చించారు. ఈ సినిమాలో విద్యావ్యవస్థ గురించి చర్చించారు. ‘రెమో’, ‘సీమ రాజా’లో శివ కార్తికేయన్ నటనను తెలుగు ప్రేక్షకులు చూశారు. ఆయా సినిమాల్లో పాత్రలకు భిన్నమైన పాత్రను ఈ సినిమాలో ఆయన చేశారు. నటుడిగా వైవిధ్యం చూపించారు. యాక్షన్ కింగ్ అర్జున్ గారు సినిమాకి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆయన సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లారు. అభయ్ డియోల్ దక్షిణాది సినిమాకు కొత్త. హిందీలో పలు సినిమాలు చేసిన ఆయన, ఈ సినిమాలో ఆయన ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రివ్యూల్లో ఆయన పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగులో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని, ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేస్తున్నాం. ఈ నెల 22 నుండి తెలంగాణలో థియేటర్లు రీ ఓపెన్ అవుతాయని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో మరో సినిమా చేస్తున్నాం. సంతానం హీరోగా ఇంకో సినిమా చేస్తున్నాం. మా నిర్మాణ సంస్థలో మరో రెండు సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మంచి కథ వస్తే తెలుగులోనూ సినిమా చేయాలనీ చూస్తున్నాం” అన్నారు.

శివ కార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్, అర్జున్, అభయ్ డియోల్, ఇవానా తదితరులు నటించిన ఈ చిత్రానికి ర‌చ‌న‌: పి.య‌స్‌.మిత్ర‌న్‌, పార్తిబ‌న్‌, స‌వారి ముత్తు, ఆంటోనీ భాగ్య‌రాజ్‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, కెమెరా: జార్జి.సి.విలియ‌మ్స్, ఎడిటింగ్‌: రూబెన్‌, మాట‌లు: రాజేష్ ఎ మూర్తి, పాటలు : రాజశ్రీ సుధాకర్.