తారక్‌కి షాక్ ఇచ్చి ప్రభాస్‌తో సినిమా రెడీ

కేజీఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఫిక్స్ అయింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కన్నడంలో సూపర్ హిట్ అయిన ఉగ్రమ్ సినిమాను రీమేక్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఆదిపురుష్ కన్నా ముందే ఈ సినిమాను ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ తీయనున్నాడట.

prabhas

వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాధాకృష్ణకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. సమ్మర్‌లో ఇది విడుదలయ్య అవకాశముంది.

దీని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటిస్తాడని అనుకున్నారు. అయితే ఇటీవల కేజీఎఫ్-2 షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్‌.. ప్రభాస్‌కు కథ చెప్పాడు. ఈ కథ ప్రభాస్‌కు కూడా నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌ను కాదని ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేయడం చర్చనీయాంశంగా మారింది.